తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. త్వరలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు గెలుపొంది.. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. అయితే ఆ పదవుల కోసం కాంగ్రెస్లో తీవ్ర పోటీ నెలకొంది. నేతలు తమకంటే తమకే పదవి ఇవ్వాలని పట్టుపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కనివారు.. సీనియర్లు ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీపడుతున్నారు.
ఈక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే రెండు స్థానాలకు పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈరోజు రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. 21వ తేదీన తిరిగి వస్తారు. అయితే నామినేషన్ల ప్రక్రియ ఈనెల 18తోనే ముగియనుంది. ఈక్రమంలో దావోస్ పర్యటనకు వెళ్లే ముందే అభ్యర్థులను ఖరారు చేసేందుకు రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.
అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్తో చర్చించేందుకు రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. శనివారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశమై అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరపనున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో మైనార్టీలు లేనందును ఆ వర్గానికి చెందిన వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్లోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటు సమయంలో సామాజిక సమీకరణాలు, పార్టీ అవసరాల దృష్ట్యా అవకాశాలు కోల్పోయిన వారికి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్లో ఎమ్మెల్సీ పదవి కోసం అద్దంకి దయాకర్, షబ్బీర్ అలీ, మహేశ్ కుమార్ గౌడ్, చిన్నారెడ్డి, మధుయాష్కీ, సంపత్ కుమార్, శోభారాణిలు ఉన్నారు. మరి వీరిలో ఎవరికి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ