నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ మూడేళ్లలో పసుపు రైతులకు చేసిందేమీ లేదని మండిపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పసుపు బోర్డు కోసం 2016లో పార్లమెంట్లో ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశామని, ఆ తర్వాత ఎంతోమంది కేంద్ర మంత్రులను, ఎంపీలను కలిశామని తెలిపారు. అరవింద్ జిల్లాకు పసుపు బోర్డు తెస్తానని తప్పుడు ప్రచారాలు చేసి ఎంపీ సీటు గెలిచారని, ఈ మూడేళ్ళుగా పసుపు బోర్డు ఎందుకు తేలేకపోయారని ప్రశ్నించారు. ఈ మూడేళ్లలో అరవింద్ నిజామాబాద్ నియోజకవర్గానికి రెండు కోట్ల రూపాయలు కూడా తీసుకురాలేదని, ఈ లెక్కన ఒక్కో పసుపు రైతుకు రూ. 200 కూడా రావని కవిత విమర్శించారు.
పసుపు బోర్డు తెస్తానన్న ఎంపీ అరవింద్ మాటలు నమ్మి రాష్ట్రవ్యాప్తంగా 90 వేల మందికి పైగా రైతులు పసుపు పండిచారని, ఇప్పుడు వారి పరిస్థితి ఏంటని కవిత మండిపడ్డారు. ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉన్న అరవింద్.. ఎప్పుడు పసుపు బోర్డు తెస్తాడు? ఎప్పుడు రైతులకి మద్దతు ధర సాధిస్తాడో చెప్పాలని ప్రశ్నించారు. మోకాళ్ళ యాత్ర చేస్తారో.. కేంద్రం లోని మీ నాయకుల వద్ద మోకరిల్లుతారో మాకు అనవసరం, రాష్ట్రానికి పసుపు బోర్డు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు 50 వేల కోట్లు కేటాయించిందని, రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారనడానికి నిదర్శనం ఇదేనని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు వారి తప్పులు కప్పి పుచ్చుకోవడానికి గ్రూప్ వన్ ఉర్దూ మీడియం పేరిట కొత్త వివాదం లేవదీస్తున్నారని బీజేపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ