ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై ఉచిత విద్యుత్ డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లోకే జమ చేసేలా, వారి ద్వారానే డిస్కంలకు చెల్లింపులు జరిపించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం తాడేపల్లి లోని తన క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన ఆయన ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ వినియోగం మరియు విద్యుత్ డిమాండ్-సప్లైపై వివరాలు కోరారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. రాష్ట్రంలోని ప్రజలకు ఇబ్బందులు రాకూడదని, కరెంటు కోతలను అధిగమించాలానే ఉద్దేశంతో విద్యుత్తును భారీగా కొనుగోలు చేశామని, మార్చిలో సగటున రోజుకు రూ.36.5 కోట్లు ఖర్చు చేసి విద్యుత్ కొనుగోలు చేశామని, ఏప్రిల్లో సగటున రోజుకు రూ.34.08 కోట్లు వెచ్చించి కరెంటు కొన్నామని వివరణ ఇచ్చారు. మార్చి నెలకు గాను 1268.69 మిలియన్ యూనిట్లకు రూ.1123.74 కోట్లు ఖర్చు అయిందని, అలాగే ఏప్రిల్లో 1047.78 మిలియన్ యూనిట్లకు గాను రూ.1022.42 కోట్లు ఖర్చు అయినట్లు తెలిపారు.
సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. డీబీటీ ద్వారా ఉచిత విద్యుత్తు డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లోకి వేయాలని, అప్పుడు రైతులే డిస్కంలకు చెల్లింపులు చేస్తారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ను అంచనా వేసుకుని, బొగ్గు కొనుగోలు విషయంలో ముందుకు సాగాలని సూచించారు. సెకీతో చేసుకున్న ఒప్పందం కారణంగా దాదాపు 45 మిలియన్ యూనిట్ల విద్యుత్ మూడేళ్లలో మూడు దశల్లో మనకు అందుతుందని తెలిపారు. వచ్చే యేడాదికి 18 మిలియన్ యూనిట్లు, 2024లో మరో 18 మిలియన్ యూనిట్లు అందుతుందని, ఆ తరువాతి సంవత్సరం 9 మిలియన్ యూనిట్లు విద్యుత్ లభిస్తుందని వెల్లడించారు. ఇక కృష్ణపట్నం మరియు విజయవాడ థర్మల్ కేంద్రాలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని, వాటి నుంచి చెరొక 800 మెగావాట్ల విద్యుత్తు చొప్పున వినియోగంలోకి వస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ