తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం అన్ని జిల్లాల డీఏఓలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతుబంధు పథకం సీఎం కేసీఆర్ ప్రత్యేక ముద్ర అని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ విజయకిరీటంలో వ్యవసాయ శాఖ పాత్ర వజ్రం లాంటిదని, కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయ ఉత్పత్తులలో తెలంగాణ అగ్రస్థానం సాధించిందన్నారు. వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను తెలంగాణ మించడం అసాధారణ విజయమని, సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో వ్యవసాయ శాఖ ఉద్యోగులు ఎంతో బాగా పనిచేశారని చెప్పారు. కరోనా విపత్తులో కూడా ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ సేవలు అనిర్వచనీయమన్నారు.
“తాజాగా జరుగుతున్న 8వ విడతతో కలిపి ఒక్క రైతుబంధు పథకం కిందనే రైతులకు ఇచ్చిన డబ్బులు రూ.50 వేల కోట్లకు చేరుతున్నది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా రైతాంగానికి ఇన్ని నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇది ప్రపంచంలోనే వినూత్న ఆలోచన. వ్యవసాయ రంగానికి ఏటా రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతుబంధు పథకం ఈ మైలురాయిని అందుకోవడం చారిత్రక సంధర్భం. రైతుబంధు వారోత్సవాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలి. విస్తృతంగా క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించాలి. పాఠశాలలు, రైతుబంధు సమితులు వినూత్నంగా కార్యక్రమాలు జరిగేట్లు పర్యవేక్షించాలి” అని మంత్రి సూచించారు. ఈ సంధర్భంగా రైతుబంధు సంబరాల కరపత్రాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి విడుదల చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ