టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (టీఆర్ఎస్వీ) విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కోఆర్డినేటర్లు, నియోజకవర్గ మరియు మండల అధ్యక్షులు పలువురు పాల్గొన్నారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో మంత్రి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఉద్యమ సమయం నుంచీ ఉధృతంగా పోరాడిన వారిలో విద్యార్థి, యువజన విభాగం నాయకులేనని, ప్రజా సమస్యలపై వారికి సంపూర్ణ అవగాహన ఉందని అన్నారు. పార్టీ విధానాలను, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను నియోజకవర్గ ప్రజలకు వివరించి మునుగోడులో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిందిగా కేటీఆర్ కోరారు.
నిన్న మునుగోడు ప్రచారంలో భాగంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్కు కట్టుబడి ఉన్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ పెద్దల అండతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టు దక్కించుకున్నారని, దీనివల్ల ఆయనొక్కరే బాగుపడతారని అన్నారు. అదే మొత్తం నియోజకవర్గం అభివృద్ధికోసం ఇస్తే.. ప్రజలందరికీ మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు. అందుకే తాము మరోసారి డిమాండ్ చేస్తున్నామని, ఆ రూ. 18 వేల కోట్లు మునుగోడు అభివృద్ధికి కేటాయిస్తే.. ఇప్పుడే ఉపఎన్నిక బరిలోనుంచి తప్పుకుంటామని ఆయన తేల్చిచెప్పారు. ఒకప్పుడు తెలంగాణ వ్యాప్తంగా 1000 గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్యతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారని, కానీ దీనిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి మిషన్ భగీరథతో వారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారని కేటీఆర్ తెలిపారు.
ఇక తెలంగాణలో అత్యధికంగా రైతుబంధు పథకం లబ్ధిదారులు మునుగోడు నియోజకవర్గంలోనే ఉన్నారని, దాదాపు 59 వేల మందికి రైతుబంధు అందుతోందని మంత్రి ప్రకటించారు. అలాగే మునుగోడులోని 1100 మందికి రైతుబీమా అందిందని, ఒక్క నల్లగొండలోనే 40 వేల మందికి ఆసరా పెన్షన్లు వస్తున్నాయని కేటీఆర్ వెల్లడించారు. ఒక్క మునుగోడే కాదని, తెలంగాణ అంతటా అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని, భారతదేశంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 978 గురుకుల పాఠశాలలు నిర్వహిస్తున్నామని, వీటిద్వారా 5 లక్షల మంది బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ప్రాథమిక విద్య అందిస్తున్నామని తెలిపారు. అలాగే ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చి లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే.. మరింతకాలం టీఆర్ఎస్ అధికారంలో ఉండాలని, దీనికోసం టీఆర్ఎస్వీ సభ్యులు తోడ్పడాలని మంత్రి కేటీఆర్ కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY