సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నియమితులు కానున్నారు. ప్రస్తుతం సీజేఐగా ఉన్న జస్టిస్ యు.యు.లలిత్ 2022, నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు 50వ సీజేగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పేరును జస్టిస్ యు.యు.లలిత్ కేంద్రానికి ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ఈ క్రమంలో ఈ ప్రతిపాదనను కేంద్రం పరిశీలించిన అనంతరం రాష్ట్రపతి కార్యాలయానికి చేరనుంది. రాష్ట్రపతి ఆమోదించి ఉత్తర్వులు జారీ చేస్తే, సుప్రీంకోర్టు కొత్త సీజే ఎంపిక ప్రక్రియ పూర్తికానుంది. సుప్రీంకోర్టులో ప్రస్తుత సీజే జస్టిస్ యు.యు.లలిత్ తరవాత జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అత్యంత సీనియర్ న్యాయమూర్తి. సంప్రదాయానికి అనుగుణంగా సీనియారిటీలో తన తరువాత స్థానంలో ఉన్న డి.వై.చంద్రచూడ్ ను తదుపరి సీజేగా ప్రతిపాదిస్తూ జస్టిస్ యు.యు.లలిత్ నిర్ణయం తీసుకున్నారు.
జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేపథ్యం:
జస్టిస్ డి.వై.చంద్రచూడ్ 1959 నవంబర్ 11న జన్మించారు. న్యూ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి ఎకనామిక్స్లో బీఏ ఆనర్స్, ఢిల్లీ యూనివర్సిటీలోని క్యాంపస్ లా సెంటర్ నుండి ఎల్ఎల్బీ చేశారు. యూఎస్ఏలోని హార్వర్డ్ లా స్కూల్ నుండి ఎల్ఎల్ఎం డిగ్రీ మరియు జురిడికల్ సైన్సెస్ లో డాక్టరేట్ పొందారు. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ, హార్వర్డ్ లా స్కూల్, యేల్ లా స్కూల్ మరియు యూనివర్శిటీ ఆఫ్ విట్వాటర్రాండ్, సౌత్ ఆఫ్రికాలో ఉపన్యాసాలు అందించారు. మానవ హక్కులపై ఐక్యరాజ్యసమితి హైకమిషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ మరియు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం, ప్రపంచ బ్యాంకు మరియు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో సహా ఐక్యరాజ్యసమితి సంస్థలు నిర్వహించిన సమావేశాలలో స్పీకర్ గా ఉన్నారు. ముంబయి విశ్వవిద్యాలయంలో కంపారిటివ్ కాన్స్టిట్యూషనల్ లా విజిటింగ్ ప్రొఫెసర్ గా, యూఎస్ఏలోని ఓక్లహోమా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో విజిటింగ్ ప్రొఫెసర్ గా కూడా పనిచేశారు.
భారత సుప్రీంకోర్టు మరియు బాంబే హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. జూన్ 1998లో బాంబే హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డారు. 1998 నుండి న్యాయమూర్తిగా నియామకం వరకు అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా విధులు నిర్వర్తించారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా 2000, మార్చి 29న నియమించబడగా, 2013, అక్టోబర్ 31న అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే వరకు కొనసాగారు. ఇక 2016, మే 13న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నియమితులయ్యారు. ఎంపిక పక్రియ అనంతరం నవంబర్ 9వ తేదీన జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 2024, నవంబర్ 10 వరకు ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY