తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 పోస్టుల కోసం మే 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమవగా, దరఖాస్తుల సమర్పణకు గడువు మే 31వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ పోస్టులకు అభ్యర్థులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు (మే 24, మంగళవారం రాత్రి) గ్రూపు-1 దరఖాస్తులు రెండు లక్షలకుపైగా వచ్చాయి. ఇప్పటికి 200428 మంది దరఖాస్తు చేసుకున్నారని టీఎస్పీఎస్సీ తాజాగా వెల్లడించింది. అలాగే ఇప్పటివరకు కొత్తగా 1,39,719 మంది అభ్యర్థులు ఓటీఆర్లో తమ వివరాలను నమోదు చేసుకున్నారని, మరో 2,90,097 మంది ఓటీఆర్లో సవరణలు చేసుకున్నారని అధికారులు వెల్లడించారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్-1 కు సంబంధించి 18 విభాగాలకు చెందిన 503 పోస్టులను భర్తీ చేయనున్నారు. 2014లో టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత వెలువడిన తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇదే కావడంతో పాటుగా ఒకేసారిగా అత్యధిక పోస్టులు భర్తీ చేయడం కూడా ఇదే తొలిసారి. ఈ గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీలో స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ ఉండనుంది. ఈసారి గ్రూప్-1 పోస్టులు ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ద్వారానే భర్తీ చేయనున్నారు. అలాగే గతంలో ఈ పోస్టుల నియామకంలో ఉన్న ఇంటర్వ్యూ ప్రక్రియను రద్దు చేస్తూ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ప్రిలిమ్స్ పరీక్ష జూలై/ఆగస్టు 2022లో, మెయిన్స్ పరీక్ష నవంబరు/డిసెంబరు 2022 లో నిర్వహించే అవకాశాలున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్రశ్నపత్రాలు తొలిసారిగా తెలుగు, ఇంగ్లీష్ తో పాటుగా ఉర్దూలో కూడా అందించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF