సామాజిక, విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాలు, సంప్రదాయ వృత్తులలో బీసీల వాస్తవిక జీవన స్థితిగతులను, వెనుకబాటు తనాన్ని, నిర్దిష్టంగా సమాచారాన్ని సేకరించడానికి తెలంగాణ బీసీ కమిషన్ కసరత్తును వేగవంతం చేసింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులలో ఇచ్చిన “టర్న్స్ ఆఫ్ రెఫరెన్సు” కు అనుగుణంగా తెలంగాణ బీసీ కమిషన్ అధ్యయనం మొదలు పెట్టింది. అందులో భాగంగా బుధవారం నాడు కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్ తో సుదీర్ఘంగా సమావేశం అయ్యింది. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు నేతృత్వంలో సభ్యులు సి.హెచ్.ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కె.కిశోర్ గౌడ్ ల బృందం, కర్ణాటక బీసీ కమిషన్ చైర్మన్ జయప్రకాశ్ హెగ్లే, సభ్యులు రాజశేఖర్ బి.ఎస్, కళ్యాణ్ కుమార్ హెచ్.ఎస్, సువర్ణ కె.టి, అరుణ్ కుమార్, శారద నాయక్, సభ్య కార్యదర్శి కె.ఎ.దయానంద్, ఐ.ఎ.ఎస్ లతో సమావేశం అయి సుదీర్ఘ సమాలోచనలు చేశారు. ఈ సమావేశం బెంగళూరులో గల కర్ణాటక బీసీ కమిషన్ కార్యాలయంలో జరిగింది. ఉదయం 10:30 గంటలకు ఆరంభమైన సమావేశం సుదీర్ఘంగా 5 గంటల పాటు కొనసాగింది.
గత కర్ణాటక బీసీ కమిషన్లు అయిన హవనూర్, వెంకట స్వామి, కాంతారాజ మున్నగునవి చేపట్టిన సమగ్ర సర్వేపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల కొనసాగింపులో సుప్రీం కోర్టు నిర్దేశించిన “త్రిబుల్ టెస్ట్” కొలమానాల నేపధ్యంగా ఇరు కమిషన్లు ప్రత్యేకంగా చర్చించాయి. ఉత్పన్నమైన న్యాయపరమైన సమస్యలు, కార్య క్షేత్రంలో ఎదుర్కున్న ఇబ్బందులను, ఇతరత్ర అంశాలపై వివరాలను సేకరించారు. పరిష్కార మార్గాలను అడిగి తెలుసుకున్నారు. గత కర్ణాటక కమిషన్లు రూపొందించిన మెథడాలజీ, ప్రశ్నావళి, అవలంబించిన పద్దతులపై ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన అన్ని పత్రాలను, ఉత్తర్వులను, చట్టాలను, కర్ణాటక బీసీ కమిషన్ నుండి సేకరించారు.
ఉదయం కమిషన్ కార్యాలయం చేరుకున్న తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను కర్ణాటక కమిషన్ సాదరంగా ఆహ్వానించింది. సమావేశం అనంతరం తెలంగాణ ఛైర్మన్, సభ్యులకు శాలువాలతో, పుష్ప గుచ్చాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. మరో 3 రోజుల పాటు తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులు అధ్యయనంలో భాగంగా బెంగళూరులోనే బస చేస్తారని తెలిపారు. ఈ రంగంలో నిష్ణాతులైన పలువురు నిపుణులతో సమావేశం కావడం, అలాగే కర్ణాటక ప్రభుత్వ పథకాలు, అమలు తీరు తెన్నులను పరిశీలించడానికి ఆయా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, అధికారులతో సమావేశం కావడంతో పాటుగా, పలువురు న్యాయ నిపుణుల సలహాలు తీసుకోనునట్టు తెలంగాణ బీసీ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF