నా పాలేరులో ప్రజలందరూ నాట్లు వేస్తుంటే ఆనందంగా చూడాలి. అందుకోసం గోదావరి జలాలను తీసుకొచ్చి పాలేరు ప్రజల పాదాలు కడుగుతా.. అదే నా జీవిత రాజకీయ లక్ష్యం. మీ మనసులో కోరిక.. ఈ ప్రాంత ప్రజల కోరిక గోదావరి జలాలు తీసుకురావడం. అది నెరవేరుస్తా.. ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు పాలేరుపైనా.. పాలేరు ప్రజలపైనా ప్రేమ ఒలకబొస్తూ పదే పదే ప్రస్తావించే మాట. కానీ.. తుమ్మలకు ఇప్పుడేమైంది.? పాలేరును కాదని ఖమ్మంలో పోటీ ఏంటి? పాలేరు ప్రజల పాదాలు గోదావరి నీళ్లతో కడుగుతానన్న తుమ్మల అర్ధాంతరంగా ఖమ్మం ఎందుకు వచ్చి చేరారు? అవకాశవాదమా? లేక అధికార దాహమా ? వంటి ప్రశ్నలెన్నో ఖమ్మం రాజకీయాల్లో ఉత్పన్నం అవుతున్నాయి.
2018 ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయారు. అనంతరం నాలుగేళ్ల పాటు.. ప్రజలకు, టీఆర్ ఎస్ కు దూరంగా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మళ్లీ పాలేరుబాట పట్టారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో గతంలో జరిగిన సమావేశంలో నా అనుచరులు, నా ప్రజలు కోరిక మేరకు మళ్లీ పాలేరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. గోదావరి జలాలతో మీ కాళ్లు కడిగే వరకూ రాజకీయ పోరాటం చేస్తానని మరోమారు తన మార్క్ హామీ ఇచ్చారు. అయితే.. బీఆర్ ఎస్ నుంచి పాలేరు సీటు దక్కకపోవడంతో తుమ్మల కినుక వహించారు. సీటు కోసం.. పోటీ కోసం.. పార్టీ మారారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తమ కోసమే తుమ్మల పార్టీ మారారని పాలేరు ప్రజలు సంబరపడ్డారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలిపించుకుందామని నిర్ణయించుకున్నారు. కానీ.. తుమ్మల ఎందుకో.. ఏమో పాలేరుకు పోలేదు.
కాంగ్రెస్ లో చేరిన అనంతరం ఖమ్మం వచ్చిన ఆయన మరోసారి కార్యకర్తలు, అభిమానులతో సమావేశమై.. రాజకీయాలకు దూరంగా ఉందామనుకున్నానని, అయితే.. నా కోసం కాకపోయినా.. మీకోసమైనా పోటీ చేస్తానని చెప్పారు. గోదావరి జిల్లాలతో ఖమ్మం జిల్లాలను సస్య శ్యామలం చేయడమే తన ధ్యేయమన్నారు. అంతేకాదు.. అవసరమైతే తల నరుక్కుంటాను కానీ.. ప్రజల ఆశలను వమ్ము చేయనని, అభిమానులు తలదించుకునే పని చేయనని గద్గద స్వరంతో ప్రకటించారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఆయన హఠాత్తుగా పాలేరును వదిలి కాంగ్రెస్ టికెట్ పై ఖమ్మం నుంచి పోటీ చేయడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు.
అసలు ఆయన ఎందుకు బీఆర్ ఎస్ ను వీరారు.? ఎవరి కోసం పార్టీ మారానని చెప్పారు.. మరి ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలను ఎందుకు వదిలేశారు.. అన్న వాదన వినిపిస్తోంది. ఏ పార్టీ టికెట్ అయితే ఆశించిన నియోజకవర్గం నుంచి రాలేదని బీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ కు వచ్చారో.. ఇప్పుడు ఆ పార్టీ కూడా ఆ నియోజకవర్గం టికెట్ ఆయనకు ఇవ్వలేదు. కాంగ్రెస్ రెండో జాబితాలో ఖమ్మం అభ్యర్థిగా తుమ్మలను ప్రకటించింది. ఆయన పోటీకి సిద్దమయ్యారు. గోదావరి జలాలతో పాలేరు ప్రజల పాదాలను కడుగుతానని చెప్పిన ఆయన ఇప్పుడు ఆ ప్రాంతాన్ని వదిలేయడం ఏ తరహా రాజకీయాలో చెప్పాలన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పాలేరులోనే పోటీ చేస్తానని పదే పదే ప్రకటించిన ఆయన.. ఆ పాలేరు టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ ఎస్ పై యుద్ధం ప్రకటించిన ఆయన.. ఇప్పుడు హఠాత్తుగా ఖమ్మం నాదే.. ప్రతీ గుమ్మంలోనూ నేనే ఉన్నానంటూ.. ఎన్నికల ప్రచారం చేస్తుండడం అవకాశవాద రాజకీయాలకు ఉదాహరణగా నిలుస్తోంది.
2014లో నాడు కాంగ్రెస్ అభ్యర్థి గా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓడిపోతే తుమ్మల ఆ తర్వాత ఎన్నికల్లో పాలేరుకు మకాం మార్చారు. 2018 ఎన్నికల్లో పాలేరు నుంచి నాటి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడిన కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కీలకనేతగా ప్రకటించుకునే ఆయనను పాలేరు ప్రజలు పక్కనబెట్టారు. దీంతో కొంతకాలం రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు. ఆయనను పట్టించుకునే వారే కరువయ్యారు. గోదావరి జలాలతో ఉమ్మడిజిల్లా భూములను సస్యశ్యామలం చేసేందుకు సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్టుల కోసమే బీఆర్ ఎస్ లో చేరానని చెప్పిన తుమ్మల తాను ఆశించిన సీటు రాకపోవడంతో పార్టీ మారిపోయారు. పార్టీ మారి ఇప్పుడు మళ్లీ ఖమ్మానికి షిప్ట్ అయ్యారు. ఇదంతా ప్రజల ప్రయోజనాల కోసమా.. తన రాజకీయ అవసరాల కోసమా అనేది ఆయనకే తెలియాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ