తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ 4, సోమవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నతాధికారులతో ఆర్టీసీ సమ్మెపై మరో సారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రకటించిన విధంగా నవంబర్ 5, మంగళవారం అర్ధరాత్రిలోపు ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ గడువు లోపు విధుల్లో చేరని ఆర్టీసీ కార్మికులను, ఎలాంటి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగంలోకి చేర్చుకోవద్దని కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మె జరుగుతున్న విధానం, నవంబర్ 7న హైకోర్టులో సమ్మెపై జరిగే విచారణలో తెలియజేయాల్సిన అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ, ఇతర ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
చట్ట వ్యతిరేకంగా సమ్మె చేపడుతున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు కాపాడుకోవాలా, కోల్పోవడమా అనే విషయాన్ని ఆర్టీసీ కార్మికులే నిర్ణయించుకోవాలని ఈ సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గడువు ముగిసాక ఏ ఒక్క కార్మికుడిని తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని, కార్మికులు విధుల్లో చేరని పక్షంలో రాష్ట్రంలో మిగిలిన ఐదువేల రూట్లలో కూడ ప్రైవేటు వాహనాలకు అనుమతులు ఇస్తామని తెలిపారు. ఇప్పటికే ఐదువేల ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో, మిగతా రూట్లలో ప్రైవేట్ వాహనాలకు అనుమతులు ఇస్తే ఇకపై రాష్ట్రంలో ఆర్టీసీ అనేదే ఉండదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హైకోర్టు విచారణను ఆధారం చేసుకుని యూనియన్లు కార్మికులను మభ్యబెడుతున్నారని, న్యాయ నిపుణుల వివరణ ప్రకారం ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు, ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చే అవకాశం లేదన్నారు. ఒకవేళ హైకోర్టు తీర్పు వేరేలా ఉన్నా ఆర్టీసీ యాజమాన్యం లేదా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తాయని కేసీఆర్ స్పష్టం చేసారు.
[subscribe]