గత 12 సీజన్లుగా క్రికెట్ అభిమానులను విశేషంగా అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), 13వ సీజన్ కు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఐపీఎల్ 2020లో ఒక కొత్త మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఐపీఎల్లో తొలిసారిగా ‘పవర్ ప్లేయర్’ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారని సమాచారం. ఈ విధానంతో ఇప్పటికే అభిమానుల ఆదరణ ఘనంగా పొందిన ఐపీఎల్ ఇకపై మరింత రసవత్తరంగా మారనుంది. పవర్ ప్లేయర్ పద్ధతి ద్వారా ఒక అదనపు ఆటగాడిని మ్యాచ్ మధ్యలో తుది జట్టులో ఆడించవచ్చు. అయితే ఈ ప్రతిపాదనపై బోర్డు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. నవంబర్ 5, మంగళవారం నాడు ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగే గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ పవర్ ప్లేయర్ నిబంధన ప్రకారం, ప్రతి మ్యాచ్కు ముందు 11 మందిని కాకుండా 15 మంది జట్టు సభ్యులను ప్రకటిస్తారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో అవసరాన్ని బట్టి తుది జట్టులో లేని ఒక ఆటగాడిని పిలిపించి నేరుగా మ్యాచ్ లో ఆడిస్తారు. మ్యాచ్ లో వికెట్ పడినప్పుడు గానీ లేదా ఓవర్ ముగిసినప్పుడు కానీ పవర్ ప్లేయర్ బరిలోకి దిగొచ్చు. ఉదాహరణకు చివరి ఓవర్లో జట్టు విజయానికి 20కి పైగా పరుగులు అవసరమైనప్పుడు క్రీజ్లో ఉన్న ఆటగాళ్లపై నమ్మకం లేకపోతే, డగౌట్ లో ఉన్న ఎవరైనా హిట్టర్ ను పిలిపించి బ్యాటింగ్ చేయించవచ్చు. అదేవిధంగా చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను కట్టడి చేసేందుకు తుది జట్టులో ఉన్న బౌలర్ కాకుండా, డగౌట్ ఉన్నవారిపై నమ్మకం ఉంటే వారితో ఆ ఓవర్ వేయించవచ్చు. అయితే ఈ నిబంధనను ఐపీఎల్కంటే ముందు ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రయోగాత్మకంగా పరిశీలించాలని బోర్డు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.