రాజకీయ పార్టీలో చేరి.. అతి తక్కువ రోజులకే రాజీనామా చేసిన వ్యక్తిగా క్రికెటర్ అంబటి రాయుడు నిలిచారు. కొద్దిరోజులుగా వైసీపీకి దగ్గరగా ఉంటోన్న అంబటి రాయుడు ఇటీవలే ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరిపోయారు. అయితే అనూహ్యంగా వైసీపీలో చేరి వారం రోజులు కూడా కాకముందే.. పార్టీ నుంచి వైదొలిగారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు.
వారం రోజుల్లోనే అంబటి వైసీపీకి గుడ్ బై చెప్పడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రకరకాల ఊహాగాణాలు వెలువడ్డాయి. ఎందుకు?.. ఏమయింది?.. వారం రోజులు కూడా కాముందే అంబటి రాయుడు ఎందుకు వైసీపీకి రాజీనామా చేశారు? అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి. ముందు నుంచి కూడా గుంటూరు ఎంపీ టికెట్ అంబటి రాయుడికి ఇస్తారని ప్రచారం జరిగింది. ఆ హామీతోనే అంబటి రాయుడు వైసీపీలో చేరారట. అదికాకపోయినా పొన్నూరు అసెంబ్లీ టికెట్ అయినా ఇస్తానని జగన్ హామీ ఇచ్చారట.
అయితే ఇప్పుడు గుంటూరు ఎంపీ టికెట్ అంబటికి కాకుండా మరొకరికి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నరసరావుపేట ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలుకు గుంటూరు ఎంపీ టికెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. అటు అసెంబ్లీ టికెట్ అయినా అంబటికి దక్కుతుందా అంటే.. అది కూడా లేదట. పొన్నూరు అసెంబ్లీ టికెట్ను కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి రోశయ్యకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ కూడా రోశయ్య వైపు మొగ్గు చూపుతున్నారట. దీంతో అసంతృప్తికిలోనై అంబటి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే శనివారం తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన అంబటి.. తాజాగా వైసీపీ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘నేను అంబటి రాయుడిని. దుబాయ్ వేదికగా జనవరి 20 నుంచి జరిగే ఐఎల్టి-20లో ముంబై ఇండియన్స్కి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ప్రొఫెషనల్ ఆటలో ఆడేందుకు నాకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం ఉండకూడదు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకున్నాను’ అంటూ అంబటి రాయుడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీంతో అంబటి వైసీపీ నుంచి తప్పుకోవడంపై వెలువడుతున్న ఊహాగాణాలకు పులిస్టాప్ పడినట్లు అయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY