విద్యార్థులకు గుడ్ న్యూస్ అందిస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని కాలేజీల్లో చదివే విద్యార్థులకు బస్సుల అదనపు ట్రిప్పులు ఏర్పాటు చేసేందుకు టీఎస్ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆదివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “హైదరాబాద్ శివారు ప్రాంతాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 12 కారిడార్లలో 350 బస్సులను తిప్పుతోంది. మరో 100 ట్రిప్పులను అదనంగా నడపాలని నిర్ణయించింది. సామాజిక బాధ్యతగా విద్యార్థులను క్షేమంగా విద్యాసంస్థలకు చేర్చేందుకు సంస్థ కట్టుబడి ఉంది” అని ఎండీ సజ్జనార్ అన్నారు.
“విద్యార్థులకు బస్సుల ఏర్పాటుపై గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారులతో హైదరాబాద్లోని బస్ భవన్లో ఆదివారం సమావేశం నిర్వహించాం. విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి 500 ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ లో అందుబాటులోకి రాబోతున్నాయి. అలాగే విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని కూడా సంస్థ భావిస్తోంది” అని ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. మరోవైపు కొందరు విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా ఫుట్బోర్డుపై ప్రయాణిస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ పద్ధతికి వెంటనే స్వస్తి చెప్పి ప్రయాణ సందర్భంగా ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE