కర్ణాటకలో మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ప్రజలకు చేరువయ్యేందుకు రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఇక ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి కర్ణాటకలో పర్యటించడం ఇది ఐదవసారి కావడం గమనార్హం. ఇక పర్యటనలో భాగంగా ఆయన శివమొగ్గ జిల్లాలో నూతనంగా నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రారంభించారు. కాగా శివమొగ్గ ఎయిర్పోర్టును దాదాపు 450 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో కమలం ఆకారంలో నిర్మించడం విశేషం. దీని ప్యాసింజర్ టెర్మినల్ భవనం లోటస్ ఆకారంలో ఉంటుంది మరియు గంటకు 300 మంది ప్రయాణీకులకు వసతి కల్పిస్తుంది.
అలాగే దీనితో పాటుగా ప్రధాని మోదీ రాష్ట్రంలో వేలాది కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా నిర్వహించారు. షికారిపుర-రాణేబెన్నూరు కొత్త రైల్వే లైన్ మరియు కోటేగంగూరు రైల్వే కోచింగ్ డిపోలకు రెండు రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కొత్త రైల్వే లైన్ రూ. 990 కోట్లతో నిర్మించబడుతుంది మరియు బెంగళూరు-ముంబై మెయిన్లైన్తో మల్నాడు ప్రాంతానికి మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. ఇంకా బైందూరు – రాణేబెన్నూరును కలుపుతూ షికారిపుర పట్టణానికి కొత్త బైపాస్ రోడ్డు నిర్మాణం, మెగారవల్లి నుండి అగుంబే వరకు ఎన్ హెచ్ -169ఎ విస్తరణ మరియు తీర్థహళ్లి తాలూకాలోని భారతీపుర వద్ద కొత్త వంతెన నిర్మాణం వంటి కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. కాగా శివమొగ్గ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప 80వ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘నేడు యడియూరప్ప పుట్టినరోజు. నేను అతని దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తున్నాను. అతను తన జీవితాన్ని పేద ప్రజలు మరియు రైతుల సంక్షేమం కోసం అంకితం చేశాడు. గత వారం కర్ణాటక అసెంబ్లీలో ఆయన చేసిన ప్రసంగం ప్రజా జీవితాన్ని గడుపుతున్న ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఇక శివమొగ్గ విమానాశ్రయం చాలా అందంగా ఉంది. ఈ విమానాశ్రయంలో కర్ణాటక సంప్రదాయం మరియు సాంకేతికత కలయికను చూడవచ్చు. ఇది కేవలం విమానాశ్రయం మాత్రమే కాదు, ఈ ప్రాంత యువత కలలు కన్న కొత్త ప్రయాణానికి ఇది సూచిక. ఎయిర్ ఇండియా విస్తరణ ప్రణాళిక మరియు బోయింగ్ మరియు ఎయిర్బస్లకు ఇటీవలి కొనుగోలు ప్రయత్నం ప్రపంచం ముందు భారతదేశం యొక్క సామర్ధ్యాన్ని నిరూపిస్తోంది’ అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE