హైదరాబాద్ లోని కాచిగూడ నింబోలి అడ్డలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. మలక్ పేట నుంచి వస్తున్న ఎంఎంటీఎస్ రైలు కాచిగూడ స్టేషన్ లో ఆగి ఉన్న కర్నూలు-హైదరాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలును డీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి పైగా గాయపడ్డట్టు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ రైలు యొక్క మూడు బోగీలు ధ్వంసమవ్వగా, మరో కొన్ని బోగీలు పట్టాలపై పడిపోయాయి. ఎంఎంటీస్ రైలు డ్రైవర్ ఇంజన్ క్యాబిన్ లో ఇరుక్కుపోయారు. అతన్ని బయటికి తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్, రైల్వే సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో ఎంఎంటీఎస్ రైలులో ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ట్రాక్ పై ఒక రైలు ఉండగా మరో రైలుకు అనుమతి ఎలా ఇస్తారని రైల్వే శాఖ అధికారులపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే రైల్వే శాఖ అధికారులు సంఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటన వలన ఆ మార్గంలో వచ్చే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాల వలనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తుంది.