మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) టీఎన్ శేషన్ నవంబర్ 10, ఆదివారం నాడు కన్నుమూశారు. ఆదివారం రాత్రి చెన్నైలోని ఆయన స్వగృహంలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. దేశంలో ఎన్నికల నిర్వహణపై తనదైన ముద్రవేసి, కీలక సంస్కరణలు తీసుకొచ్చి ఎన్నికల సంస్కర్తగా టీఎన్ శేషన్ పేరు ప్రఖ్యాతలు గడించారు. 1932లో కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని తిరునెల్లయ్లో శేషన్ జన్మించారు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసి, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నతవిద్య అభ్యసించారు. 1955 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన శేషన్ 1990–96 సంవత్సరాల మధ్య దేశానికి 10వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేశారు.
ఎన్నికల ఫొటో గుర్తింపు కార్డు విధానం, ఎన్నికల ప్రచార సమయం కుదింపు, ఎన్నికలలో అభ్యర్థుల ఖర్చుపై నియంత్రణ వంటి అనేక సంస్కరణలను ఆయన హయాంలోనే తీసుకువచ్చారు. ఎన్నికల నిమయావళిని కఠినంగా అమలు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. 1996లో రామన్ మెగసెసే అవార్డు కూడ అందుకున్నారు. టీఎన్ శేషన్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రస్తుత కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా, మాజీ సీఈసీ ఎస్వై ఖురేషి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ నేత శశి థరూర్, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పలువురు నాయకులు, అధికారులు శేషన్ భారత ఎన్నికల వ్యవస్థకు చేసిన సేవలను గుర్తు చేసుకుని ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసారు.