భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా నవంబర్ 10, ఆదివారం నాడు నాగపూర్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించింది. టీ20 సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్ (62), కేఎల్ రాహుల్ (52) పరుగులతో రాణించగా, అనంతరం భారత బౌలర్ దీపక్ చహర్ అంతర్జాతీయ టి20ల్లో అత్యుత్తమ ప్రదర్శన (3.2–0–7–6) తో బంగ్లాదేశ్ జట్టును కుప్పకూల్చాడు. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్ గా దీపక్ చహర్ నిలిచాడు. ఒకదశలో బంగ్లాదేశ్ మ్యాచ్ పై పట్టు సాధింది విజయానికి దగ్గరవుతున్న సమయంలో శివమ్ దూబే రెండు కీలక వికెట్లు పడగొట్టాడు, చివర్లో దీపక్ చాహర్ హ్యాట్రిక్ ప్రదర్శనతో మూడో టీ20లో భారత జట్టు 30 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించిన దీపక్ చాహర్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.
మొదటగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన భారతజట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి 174 పరుగులు చేసింది. రెండో ఓవర్లో కేవలం రెండు పరుగులతోనే రోహిత్ శర్మ పెవిలియన్ బాట పట్టాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం (19) పరుగులకే వెనుదిరిగాడు. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ తో కలిసి కెఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ముందుగా నిదానంగా బ్యాటింగ్ సాగించిన ఈ జోడీ ఆ తర్వాత బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డారు. శ్రేయస్ అయ్యర్ (62), కేఎల్ రాహుల్ (52) పరుగులతో చేసి జట్టు స్కోర్ లో కీలక పాత్ర వహించారు. ఇక మ్యాచ్ చివర్లో మనీశ్ పాండే (22) పరుగులతో నాటౌట్ గా నిలవడంతో భారత జట్టు 174 పరుగులు చేయగలిగింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ఫఫియుల్, సౌమ్య సర్కార్ చెరో రెండు వికెట్లు తీసారు. అనంతరం 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్, మహ్మద్ నయీమ్ (81; 48 బంతుల్లో, 10×4, 2×6) జోరుతో విజయం సాదించేటట్లే కనిపించింది. అయితే శివమ్ దూబే(3/30), దీపక్ చాహర్ (6/7) కీలక సమయంలో వికెట్లు పడగొట్టడంతో 19.2 ఓవర్లలోనే 144 పరుగుల వద్దే ఆలౌట్ అయింది.