వచ్చే నెలలో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆస్పత్రి విస్తరణ పనులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేస్తారని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్ను భారీగా విస్తరించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మొత్తం 33 ఎకరాల్లో నిమ్స్ విస్తరణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించిన ఆయన, సుమారు 2వేల పడకల సామర్థ్యంతో మరో మూడు కొత్త బ్లాకులను నిర్మించనున్నట్లు తెలిపారు. ఓపీ, ఐపీ, అత్యవసర సేవల కోసం ప్రత్యేక బ్లాకులను ఏర్పాటు చేయనున్నామని, ఇక నిమ్స్ విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 1571 కోట్ల రూపాయల వ్యయం చేస్తోందని తెలియజేశారు.
కాగా సీఎం కేసీఆర్ సూచన మేరకు గచ్చిబౌలి, సనత్నగర్, అల్వాల్, ఎల్బీనగర్లో నిర్మించనున్న టిమ్స్తో పాటు వరంగల్ హెల్త్సిటీ నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని, రాష్ట్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు నాలుగు టిమ్స్ ఆస్పత్రులు, నిమ్స్ను విస్తరించామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. దీంతో మరో ఆరు వేల పడకలు అందుబాటులోకి రానున్నాయని, కార్పోరేట్ స్థాయిలో ట్రామా కేర్ సెంటర్లను బలోపేతం చేస్తామని అన్నారు. ఇక ఎర్రమంజిల్ కాలనీలో కొత్త అత్యాధునిక మల్టీస్పెషాలిటీ నిమ్స్ బ్లాక్ను నిర్మించడం ద్వారా విస్తృత వైద్య సేవలను అందించగలమని వివరించారు. ఈ కొత్త బ్లాక్లో మొత్తం 500 ఐసియు ఎమర్జెన్సీ బెడ్లతో సహా 2,000 సూపర్ స్పెషాలిటీ బెడ్లు ఉంటాయని, అలాగే గుండె, మూత్రపిండాలు, కాలేయం, క్యాన్సర్ కేర్, అత్యవసర మరియు ట్రామా కేర్ సౌకర్యాలతో పాటు అన్ని ఆర్థోపెడిక్ స్పెషాలిటీలతో సహా మొత్తం 42 సూపర్-స్పెషాలిటీ విభాగాలు కొత్త నిమ్స్ బ్లాక్లో పనిచేస్తాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE