కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి న్యూఢిల్లీలో సంబంధిత మంత్రిత్వ శాఖల అధికారులతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంపై చర్చించి, కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని, ఈ సభకు కేంద్ర హోంశాఖ అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయి ప్రసంగించనున్నట్టు సమాచారం. అదేవిధంగా మహారాష్ట్ర, కర్ణాటక వంటి రెండు రాష్ట్రాల కొన్ని భాగాలు గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్నందున, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకనాథ్ షిండే, బస్వరాజ్ బొమ్మైలను మరియు పలువురు కేంద్ర మంత్రులను కూడా ఈ సభకు ఆహ్వానించే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాల తరహాలోనే ఈ వేడుకలు కూడా ఏడాది పాటు నిర్వహించాలని అవకాశం ఉంది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
మరోవైపు శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో తెలంగాణ వజ్రోత్సవాలపై ప్రకటన చేసే అవకాశం ఉంది. భారత్ యూనియన్ లో తెలంగాణ (హైదరాబాద్ రాష్ట్రం) విలీనమై 74 సంవత్సరాలు పూర్తిచేసుకుని 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో “తెలంగాణ వజ్రోత్సవాలు” పేరుతో వేడుకలు నిర్వహించాలని అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తుంది. దీంతో అధికారికంగా వజ్రోత్సవాల నిర్వహణపై కేబినెట్ లో చర్చించి ప్రకటన చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY