బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు ఆయన తొలి ప్రయత్నంగా మహారాష్ట్రలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే రెండు పర్యాయాలు భారీ బహిరంగ సభలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేసిన సీఎం కేసీఆర్, మూడోసారి మరో బహిరంగ సభకు ముహూర్తం నిర్ణయించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 24న మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో మరో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. దీనిద్వారా ఆయన మరోసారి తెలంగాణ మోడల్ను మరాఠా ప్రజలకు వివరించనున్నారు. గతంలో నిర్వహించిన నాందేడ్ మరియు కందార్-లోహా బహిరంగ సభలు విజయవంతం కావడం మరియు పార్టీలోకి వివిధ పార్టీల నుండి నాయకుల చేరికలు జరగడం ఆ పార్టీలో జోష్ నింపింది. దీంతో మూడో సభను మధ్య మహారాష్ట్ర కేంద్రంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం ఔరంగాబాద్ లోని అంకాస్ మైదాన్లో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించేందుకు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నేతృత్వంలో సభకు సంబంధించిన విస్తృత ఏర్పాట్లు చేయనున్నారు. ఆయనతో పాటు ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారి, మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే తదితరులకు బహిరంగ సభ ఏర్పాట్ల బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా శంభాజీనగర్లో తెలంగాణ పథకాలను వివరించే ఏడు వీడియో స్క్రీన్ ప్రచార రథాలను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రారంభించారు. ఇక ఈ సభకు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో.. దాదాపు లక్షన్నర మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత రెండు సభలను మించి ఈ సభను విజయవంతం చేసేలా కసరత్తు చేస్తున్నారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ సీట్ల రాజకీయాలతో మహారాష్ట్ర ప్రజలు విసుగుచెందారని, తెలంగాణ మోడల్ను మహారాష్ట్రలో కూడా అమలు చేయాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారన్నాని తెలిపారు. దేశంలో రైతులకు స్వర్ణయుగం సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని, నాందేడ్, కందార్-లోహ సభలకు లక్షలాది మంది తరలివచ్చారని, ఈ క్రమంలో ఔరంగాబాద్ సభతో కొత్త చరిత్ర సృష్టిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో మాదిరే మహారాష్ట్రలోనూ రైతులకు పెట్టుబడి సాయం అందించాలని, దీనికోసం మహారాష్ట్రలోని రైతులందరూ కలిసికట్టుగా పోరాడి రైతుబంధును సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రూ.4 లక్షల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశామని వెల్లడించిన జీవన్ రెడ్డి, దేశంలో రైతుల ఆత్మహత్యలకు మోదీ ప్రభుత్వ దుర్మార్గ విధానాలే కారణమని ఆరోపించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE