కేంద్ర ప్రభుత్వం దక్షిణాదికి చెందిన నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి, సినీ కథా రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్, ప్రముఖ సంగీత దిగ్గజం ఇళయరాజా, ప్రముఖ అథ్లెట్, పరుగుల రాణి పీటీ ఉషా, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్డే లు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేత వీరంతా ప్రముఖ వ్యక్తుల కేటగిరీలో రాజ్యసభకు నామినేట్ చేయబడ్డారు. కాగా వివిధ రంగాల చెందిన ఈ ప్రముఖులు రాజ్య సభకు నామినేట్ అయిన విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ, వారికి అభినందనలు తెలియజేశారు.
వి.విజయేంద్ర ప్రసాద్ దశాబ్దాలుగా సృజనాత్మక రంగంతో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు. అతని రచనలు భారతదేశం యొక్క అద్భుతమైన సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి. అతను రాజ్యసభకు నామినేట్ అయినందుకు నా అభినందనలు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. “ఇళయరాజా తన సృజనాత్మక సంగీతంతో తరతరాలుగా ప్రజలను ఆకట్టుకున్నారు. అతని సంగీతం భావోద్వేగాలను అందంగా ప్రతిబింబిస్తుంది. అతని జీవిత ప్రయాణం కూడా అంతే స్ఫూర్తిదాయకం, నిరాడంబరమైన నేపథ్యం నుండి ఎదిగి ఆయన చాలా సాధించాడు. ఇళయరాజా రాజ్యసభకు నామినేట్ అయినందుకు ఆనందంగా ఉంది” అని ప్రధాని మోదీ అన్నారు.
“అద్భుతమైన పీటీ ఉషా జీ ప్రతి భారతీయునికి స్ఫూర్తి. క్రీడలలో ఆమె సాధించిన విజయాలు విస్తృతంగా తెలిసినప్పటికీ, గత కొన్నేళ్లుగా వర్ధమాన క్రీడాకారులకు మార్గదర్శకత్వం వహించడంలో ఆమె చేసిన కృషి కూడా అంతే ప్రశంసనీయం. రాజ్యసభకు నామినేట్ అయినందుకు ఆమెకు అభినందనలు. అలాగే వీరేంద్ర హెగ్డే విశిష్టమైన సమాజ సేవలో ముందున్నారు. ధర్మస్థల ఆలయంలో ప్రార్థనలు చేసే అవకాశం నాకు లభించింది మరియు ఆరోగ్యం, విద్య, సంస్కృతిలో ఆయన చేస్తున్న గొప్ప పనిని కూడా చూసాను. ఆయన వలన ఖచ్చితంగా పార్లమెంటు కార్యకలాపాలు మెరుగుపడతాయి” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY