వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం ఇజ్రాచిట్టెంపల్లి వద్ద శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందగా, నలుగురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రమాదం గురించి తెలుసుకున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాధితులు చికిత్స పొందుతున్న మర్పల్లి సివిల్ ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని రకాల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.
బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో ఎంపీ రంజిత్రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తదితరులు ఉన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి రూ.50,000, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రూ.50,000, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ రూ.25 వేల రూపాయలు చొప్పున తక్షణ సాయంగా బాధిత కుటుంబాలకు అందజేశారు. మరోవైపు భవిష్యత్తులో ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు వేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమిబసు మర్పల్లి సివిల్ ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు, వారికి భరోసాగా ఉంటామని హామీ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ