తన సెంటిమెంట్గా గజ్వేల్ నియోజకవర్గాన్ని ఎంచుకొని రెండుసార్లు సీఎం పదవి చేపట్టిన కేసీఆర్..ఈ సారి ఎన్నికల్లో కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మలివిడత తెలంగాణ ఉద్యమ కాలం నుంచి 2021 వ సంవత్సరం వరకు ఎంతో సాన్నిహిత్యం, అనుబంధం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పుడు అక్కడ ప్రత్యర్థులుగా పోటీ పడుతుండటంతో అందరి చూపూ అటే పడింది. గజ్వేల్ గడ్డపై మూడోసారి పోటీ చేస్తూ హ్యాట్రిక్ కొట్టేందుకు సీఎం కేసీఆర్ తన అభివృద్ధే తన గెలుపు మంత్రం అన్న ధీమాతో ఉండగా, ఈటల బీసీ నినాదాన్ని నమ్ముకుంటూ బరిలోకి దిగారు.
గతంలో రెండు సార్లు అక్కడే గెలిచిన కేసీఆర్.. గజ్వేల్ను తెలంగాణలోనే అభివృద్ధికి నమూనాగా మలచడంలో సఫలమయ్యారని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్ వద్ద కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్, కొండపాక మండలంలో మల్లన్నసాగర్ మిషన్ భగీరథ పథకం, ఎడ్యుకేషన్ హబ్, గజ్వేల్–ప్రజ్ఞాపూర్లో రింగురోడ్డు, ములుగులో హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్రీ యూనివర్సిటీ, వంద పడకల జిల్లా ఆస్పత్రి, మరో వంద పడకలతో మాతా శిశురక్షణ ఆస్పత్రి వంటి అభివృద్ధి పనులు సీఎం కేసీఆర్ హయాంలో పెద్ద ఎత్తున జరిగాయి.
ఇప్పటికే గజ్వేల్ గడ్డ.. కేసీఆర్ అడ్డా అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా జరిగిన అభివృద్ధిని చూపిస్తూ.. కేసీఆర్ను భారీ మెజారిటీతో గెలిపించడానికి బహుముఖ వ్యుహంతో ముందుకు సాగుతోన్నాయి. మంత్రి హరీశ్రావు ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరిస్తూ ఇప్పటికే సుడిగాలి ప్రచారాలు చేస్తూ జనాల్లోకి దూసుకుపోతున్నారు. అంతేకాదు బూత్లెవల్ మేనేజ్మెంట్ సక్రమంగా జరగడానికి వంద ఓట్లకు ఒక ఇన్చార్జిని కూడా నియమించారు.
గజ్వేల్, తూప్రాన్,కొండపాక, మనోహరాబాద్, ములుగు, మర్కూక్, వర్గల్, జగదేవ్పూర్, కుకునూర్పల్లి మండలాలతో కూడుకొని ఉన్న గజ్వేల్ నియోజకవర్గం.. యాదాద్రి, సంగారెడ్డి, జనగామ మేడ్చల్ జిల్లాల సరిహద్దులో ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ను ఆనుకొని ఉండటం వల్ల గజ్వేల్లో సిటీ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. గజ్వేల్ నియోజకవర్గంలో 179 పంచాయతీలున్నాయి.
గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికలలో మల్లన్నసాగర్ నిర్వాసితులను తమవైపు తిప్పుకోవడానికి మూడు ప్రధాన పార్టీలు ఆరాటపడుతున్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల తొగుట మండలంలో పల్లెపహాడ్, ఎర్రవల్లి, లక్ష్మాపూర్, రాంపూర్, వేములగాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, కొండపాక మండలం సింగారం గ్రామాలు గతంలో పూర్తిగా ముంపునకు గురయ్యాయి. ఆ గామాలకు చెందిన 10వేలకుపైగా ఓట్లు ఉన్నాయి.ఈ ఓట్లపైనే ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కన్నేసాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆ సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని, ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. సమస్యల కోసం పోరాడుతామని ఆ నేతలు హామీ ఇస్తున్నారు.
బీసీ నినాదం, స్థానిక సమస్యలే ఎజెండాగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల బరిలో దిగారు. నియోజకవర్గంలో దాదాపు 1.40లక్షల బీసీ ఓటర్లు ఉండగా..అందులో తన సొంత సామాజికవర్గానికి చెందిన ముదిరాజులు 55వేల వరకు ఉండటం తనకు కలిసొచ్చే అంశంగా ఆయన భావిస్తున్నారు. అభివృద్ధి పేరుతో 30వేల కుటుంబాలకు చెందిన భూములు లాక్కొని, సరైన నష్ట పరిహారం ఇవ్వకపోవడం వల్లే ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ..వారందరికీ తాము అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు.అంతేకాదు అటు బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తి నేతలను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి మాత్రం నేను లోకల్ అంటూ.. స్థానిక సెంటిమెంట్ను ఫాలో అవుతూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపిస్తే 24 గంటలు కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంటానని ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ గెలిచినా..ఈటల రాజేందర్ గెలిచినా వారిద్దరూ అందుబాటులో ఉండరని చెబుతూ లోకల్ ఓట్లు రాబుట్టుకునే పనిలో పడ్డారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE