గ్రేటర్ హైదరాబాద్లో రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలాబలాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఇక్కడ అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు పాతబస్తీలో ఎంఐఎం కీలకంగా ఉంటుంది. కొంత కాలంగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానంతోపాటు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీయే ప్రాతినిథ్యం వహిస్తూ వస్తోంది. ఆ ప్రాంతాల్లో 60 శాతానికిపైగా ముస్లిం జనాభా ప్రతిసారి పతంగి పార్టీకి జై కొడుతున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నట్లు కనిపిస్తోంది. సిట్టింగ్ స్థానాల్లో ఒకటైన చాంద్రాయణగుట్టలో ఆ పార్టీ శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ కాస్త గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, ఈ ఎన్నికల్లో ఆ స్థాయి నేతలెవరూ పోటీ చేయకపోవడం అక్బరుద్దీన్కు కలిసొచ్చే అంశం. చార్మినార్లోనూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసినా విజయం ఎంఐఎంను వరించింది. ఈసారి కాంగ్రెస్ నుంచి అంతగా బలమైన అభ్యర్థి బరిలో లేకపోవడం.. బీజేపీ గట్టి పోటీ ఇస్తున్నా ఓటు బ్యాంకు లేకపోవడంతో ఆ సీటు మజ్లిస్ ఖాతాలోకి చేరే అవకాశముంది.
బహదూర్పురాలోనూ అభ్యర్థి కార్పొరేటర్ కావడం, బలమైన ప్రత్యర్థి కాకపోవడం, మజ్లి్సకు భారీ ఓటు బ్యాంకు ఉండటంతో విజయం సులభం కానుంది. సిట్టింగ్ స్థానాలైన కార్వాన్, మలక్పేట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి బలమైన అభ్యర్థులు ఉండటం.. అన్ని పార్టీలకు ఓటు బ్యాంకు ఉండటంతో చెమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. మజ్లిస్ ఓటు బ్యాంకును కాపాడుకుంటూ ఈ రెండు స్థానాల్లో గట్టెక్కే అవకాశముంది. పతంగి పార్టీ అధీనంలో ఉన్న నాంపల్లి, యాకుత్పురా నియోజకవర్గాల్లో మాత్రం ఈసారి హోరాహోరీ తప్పదని తెలుస్తోంది.
ఎంఐఎంకు నాంపల్లి అత్యంత ప్రతిష్ఠాత్మకమైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో జరిగిన ఎన్నికల్లో అప్పట్లో కొత్తగా ఏర్పాటైన నాంపల్లి నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవడం ఎంఐఎంకు సవాల్గా మారింది. అప్పట్లో ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ విరాసత్ రసూల్ ఖాన్ కేవలం 6,799 ఓట్ల మెజారిటీతో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఫిరోజ్ఖాన్పై విజయం సాధించారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగిన ఫిరోజ్ ఖాన్పై ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్ 17,296 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
అలాగే 2018లో ఎన్నికల్లో పార్టీ మారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఫిరోజ్ఖాన్పై ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్ మేరాజ్ 9,675 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఎంఐఎం నుంచి బరిలోకి దిగిన మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ ఆ స్థాయిలో పోటీ ఇవ్వగలరా అనేది ఆ పార్టీకి ఆందోళన రేకెత్తిస్తోంది. మరోవైపు ప్రచారంలో ఊపు మీదున్న కాంగ్రె్సకు గత ఎన్నికలకంటే బలం పెరిగిందని, ఓటర్లు కాంగ్రెస్ పథకాల వైపు ఆకర్షితులైతే నాంపల్లిలో కాంగ్రెస్ పాగా వేసే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే.. యాకుత్పురా నుంచి మజ్లిస్ అభ్యర్థిగా జాఫర్హుస్సేన్ పోటీ చేస్తున్నారు. ఆయన విజయం అంత ఈజీ కాదని పాతనగర ఓటర్లలో చర్చ జరగుతోంది. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో ఎంఐఎంకు ఎదురీత తప్పేలా లేదు అన్నట్లుగా పరిస్థితి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE