తెలంగాణలో అధికారమే ధ్యేయంగా కాంగ్రెస్ పరితపిస్తోంది. అందుకోసం దేనికీ ఆలోచించకుండా హామీల మీద హామీలు గుప్పిస్తోంది. ఆచరణ సాధ్యమా కాదా.. తర్వాత సంగతి ఇప్పటికైతే ఆ ప్రకటనల్లో బీఆర్ ఎస్ ను మించిపోతోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలతో ప్రచారానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఇప్పుడు తాజాగా 37 అంశాలతో విడుదల చేసిన మేనిఫెస్టోతో ప్రజలను మైమరిపించేలా చేస్తోంది. అన్ని వర్గాలకూ అందులో చోటు కల్పించడం ద్వారా మేనిఫెస్టో రూపకల్పనలో ఆ పార్టీ గట్టిగానే కసరత్తు చేసినట్లు కనిపిస్తోంది. ఉద్యోగ కల్పన, నిరుద్యోగుల సమస్యలకు బీఆర్ ఎస్ ప్రాధాన్యం ఇవ్వలేదన్న విమర్వల నేపథ్యంలో కాంగ్రెస్ ఆ అంశాన్ని హైలెట్ చేస్తూ.. ఉద్యోగాలను ఇస్తామని చెప్పడమే కాదు.. డేట్ తో సహా మేనిఫెస్టోలో పలు నోటిఫికేషన్లను వెల్లడించింది.
యువత, మహిళలు, రైతులను ఆకట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టో కనిపిస్తోంది. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో మొత్తం 37 అంశాలకు చోటు కల్పించారు. సర్వమతాలకు కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ పత్రమని, హిందువులకు భగవద్గీత , ముస్లింలకు ఖురాన్, క్రిస్టియన్లకు బైబిల్ మాదిరిగా కాంగ్రెస్ పార్టీకి మేనిఫెస్టో అంతటి విలువైనదని వ్యాఖ్యానించడమే కాదు.. అన్ని వర్గాలనూ ఆకట్టుకునేలా రూపొందించారు. దాదాపు 42 పేజీలతో కాంగ్రెస్ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అలాగే జాబ్ క్యాలెండర్ను కూడా విడుదల చేసింది. గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీ డేట్ను కూడా ప్రకటించింది. ఫిబ్రబర్ 1, 2024లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
ఇక మేనిఫెస్టోలని ముఖ్య అంశాలను పరిశీలిస్తే.. ఉద్యోగ కల్పన, నిరుద్యోగులకు రూ. 4 వేల భృతితో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించింది. వాటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ ఉంటుందని పేర్కొంది. 18 సంవత్సరాల పైబడి చదువుకునే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎస్సీ రిజర్వేషన్ల పెంపు, ఏబీసీడీ వర్గీకరణ, బెల్ట్ షాపులు రద్దు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఎంటి స్థలం, గౌరవ భృతి, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, 3 లక్షల వడ్డీ లేని పంట రుణం, కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ.
తొలి క్యాబినెట్లో మెగా డీఏస్సీ, రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పోరేషన్కు రూ.1000 కోట్ల బడ్జెట్, విద్యార్థులకు ఫ్రీ ఇంటర్ నెట్, విద్యా రంగానికి బడ్జెట్లో 6 నుంచి 15 శాతం వరకు పెంపు, ఖమ్మం, ఆదిలాబాద్లలో నూతన విశ్వవిద్యాలయాలు, వైద్య రంగం బడ్జెట్ రెట్టింపు, ధరణి స్థానంలో భూమాత పోర్టల్, రేషన్ ద్వారా సన్న బియ్యం , రేషన్ డీలర్లకు రూ.5 వేల గౌరవ భృతి, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, ప్రతీ ఆటో డ్రైవర్కు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం, కళ్యాణమస్తు కింద లక్ష రూపాయలతో పాటు 10 గ్రాముల బంగారం, మహిళా సంఘాలకు పావులా వడ్డీ రుణాలు, జూనియర్ న్యాయవాదులకు మొదటి 5 సంవత్సరాలు నెలకు రూ.5 వేల గౌరవ భృతి, 100 కోట్లతో జర్నలిస్ట్ల సంక్షేమ నిధి, హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాల్లో జర్నలిస్టుల ఇళ్ళ సమస్యకు పరిష్కారం, దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్, దేవాలయాలకు దూప దీప నైవేద్యం కింద నెలకు రూ.12 వేలు వంటి అంశాలు ఉన్నాయి.
అంతేకాకుండా అంగన్ వాడీ టీచర్ల జీతం రూ.18000కు జీతం పెంచుతామన్నారు. ప్రధానంగా నోటిఫికేషన్లను విడుదల తేదీలతో సహా మేనిఫెస్టోలోనే పొందుపరచడం ఆసక్తికర అంశం. గ్రూప్ 1 పోస్టులకు 2024, ఫిబ్రవరి 1న, గ్రూప్ 2 పోస్టులకు 2024 మార్చి 1న, డిసెంబర్ 15వ తేదీన ఫేజ్ 2 నోటిఫికేషన్, వీటితో పాటు.. గ్రూప్ 3 పోస్టులకు 2024 జూన్ 1న ఫేజ్ 1, 2024 డిసెంబర్ 1న ఫేజ్ 2 , గ్రూప్ 3 పోస్టులకు 2024 జూన్ 1న ఫేజ్ 1, 2024 డిసెంబర్ 1న ఫేజ్ 2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. గ్రూప్ 4 నియామకాలకు జూన్ 1న ఫేజ్ , 2024 డిసెంబర్ 1న ఫేజ్ 2 నోటిఫికేషన్లు ఉంటాయని తెలిపారు. వీటితో పాటు.. పోలీస్ , విద్యా, వైద్య రంగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా తేదీలను ప్రకటించారు. కచ్చితంగా ఇది నిరుద్యోగులను ఆకట్టుకుంటుందనే చెప్పాలి. మరి ప్రజలు దీన్ని ఎంత వరకు నమ్ముతారు.., బీఆర్ ఎస్ దీనిపై ఏ విధంగా స్పందిస్తుంది.. అనేది వేచి చూడాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE