వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో అక్టోబరు 20వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రజాప్రస్థానం పాదయాత్ర వాయిదా పడింది. ఈ విషయాన్ని బుధవారం నకిరేకల్ నియోజకవర్గం కొండపాలకగూడెం వద్ద నిర్వహించిన ప్రెస్ మీట్ లో వైఎస్ షర్మిల వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ప్రజాప్రస్థానం పాదయాత్ర 21 రోజుల పాటు దిగ్విజయంగా సాగింది. వేలాది మంది తరలివచ్చి మాకు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజాప్రస్థానం పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. ఎన్నికల కమిషన్ నిబంధనలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాం. కోడ్ ముగిసిన వెంటనే తిరిగి ప్రజాప్రస్థానం ప్రారంభమవుతుంది. 21 రోజుల పాటు సాగిన యాత్ర ఆరు నియోజకవర్గాలను కవర్ చేశాం. ఇందులో చేవెళ్ల, మహేశ్వరం, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, దేవరకొండ, మునుగోడు ఉన్నాయి. ప్రస్తుతం నకిరేకల్ నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతోంది. 21 రోజుల పాదయాత్రలో 150 గ్రామాలను సందర్శించాం. వందల సమస్యలు విన్నాం. వేలాది మంది మాతో చేతులు కలిపారు. మాతో కలిసి నడిచారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు” అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
వడ్లను ఆఖరి గింజ వరకూ కొనాలని డిమాండుతో 72 గంటల నిరాహార దీక్ష:
మరోవైపు రైతుల వడ్లను చివరి గింజ వరకు కొనాలని డిమాండ్ చేస్తూ, 72 గంటల పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తామని వైఎస్ షర్మిల తెలిపారు. తమ పార్టీ రైతుల పక్షాన ఎల్లప్పుడూ నిలబడుతుందన్నారు. హైదరాబాద్ లో శుక్రవారం ఉదయం నుంచి దీక్ష కొనసాగుతుందని, రైతులు ఎవరూ అధైర్యపడొద్దు, వారి పక్షాన మేం పోరాడుతామని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ