తెలంగాణకు చెందిన ‘ధ్రువ’ స్పేస్ టెక్ ప్రైవేట్ సంస్థ ద్వారా, శనివారం శ్రీహరికోట నుంచి ప్రయోగించబడిన రెండు నానో శాటిలైట్స్ విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రోకు చెందిన “పీఎస్ఎల్వీ-సీ54” తో పాటుగా హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ‘ధ్రువ’ స్టార్టప్ సంస్థ పంపిన “తై బోల్ట్ 1 మరియు తై బోల్ట్ 2” అనే రెండు నానో ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం కావడం దేశ ఔత్సాహిక అంకుర సంస్థల చరిత్రలో సుదినంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రైవేట్ రంగం ద్వారా ఉప గ్రహ ప్రయోగాల చరిత్రలో మరో గొప్ప విజయం అన్నారు. టీహబ్ సభ్య సంస్థ అయిన ‘స్కైరూట్’ స్టార్టప్ కంపెనీ ఇటీవలే ప్రయోగించిన “విక్రమ్-ఎస్” శాటిలైట్ విజయవంతం కావడం ద్వారా దేశ ఉప గ్రహ ప్రయోగాల చరిత్రలో తెలంగాణ స్టార్టప్ కంపెనీ మొట్టమొదటి సంస్థగా చరిత్రను లిఖించిందని సీఎం కేసీఆర్ అన్నారు.
ఈ ప్రయోగాలతో భారత అంతరిక్షరంగంలో హైదరాబాద్ అంకుర సంస్థలు ద్వారాలు తెరిచాయని సీఎం అన్నారు. ప్రపంచ స్పేస్ ఎకానమీలో భారత్ వాటాను పెంచేందుకు ఉద్దేశించిన ప్రైవేట్ రాకెట్ల ప్రయోగానికి మొన్నటి “విక్రమ్ ఎస్” నేటి “తై బోల్ట్ 1 మరియు తై బోల్ట్ 2” ప్రయోగాల విజయం శుభారంభాన్ని ఇచ్చిందని సీఎం అన్నారు. విజయం సాధించిన ఈ రెండు ఉప గ్రహ ప్రయోగాలు తెలంగాణ కీర్తిని దిగంతాలకు దాటాయన్నారు. ఈ ఉప గ్రహ ప్రయోగాల ద్వారా స్టార్టప్స్ సిటీగా హైదరాబాద్ కున్న విశిష్టత రెట్టించిందని సీఎం అన్నారు. ఔత్సాహికుల ప్రతిభను వెలికితేయడం, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక సమాచార రంగాల్లో అవకాశాలు సృష్టే లక్ష్యంగా ప్రారంభించిన టీహబ్ లు భవిష్యత్తులో మరెన్నో మైలురాళ్ళు సాధిస్తాయనే నమ్మకం తనకుందని, ఇది ఆరంభం మాత్రమేనని సీఎం పేర్కొన్నారు.
టీ హబ్ ప్రోత్సాహంతో తమ స్టార్టప్ సంస్థల ద్వారా ఉప గ్రహాలను రూపొందించి వాటిని విజయవంతంగా ప్రయోగించి తెలంగాణ కీర్తిని చాటిన ‘స్కైరూట్’ మరియు ‘ధ్రువ’ స్పేస్ స్టార్టప్ సంస్థల ప్రతినిధులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలను తెలిపి అభినందించారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ యువత తమ మేధో సంపదను దేశ ప్రగతికోసం వెచ్చించి భారత దేశ అభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. తమ ప్రతిభను ప్రపంచానికి దాటుతూ భారత దేశ కీర్తిని ఇనుమడింపచేసే యువతీ యువకులకు వారి అద్భుతమైన ఆలోచనకు తమ అంకుర సంస్థల ద్వారా కార్యరూపమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శాస్త్ర సాంకేతిక ఐటి రంగాల్లో ఔత్సాహికులైన యువతీ యువకుల ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేస్తున్న యువనేత, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావును, ఉన్నతాధికారులను, టీహబ్ సిబ్బందిని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు.
మరింత సమాచారం:
అనతికాలంలోనే ప్రగతి ప్రస్థానంలో దూసుకుపోతూ ఇప్పటికే పలు రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం, మరో అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించింది. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడం ద్వారా రేపటి తరాల ప్రతిభను వెలికితీసి, ఆకాశమే హద్దుగా తీర్చిదిద్దుతున్న తెలంగాణ రాష్ట్రం, దేశ స్టార్టప్ చరిత్రలో అంతరిక్షంలోకి ప్రైవేట్ ఉప గ్రహాల ప్రయోగ చరిత్రలో మరో రికార్డును సృష్టించింది. ఐటీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో యువతను ప్రోత్సహించే దిశగా సీఎం కేసీఆర్ దార్శనికతతో, యువనేత మంత్రి కేటీఆర్ కృషితో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్ లో సభ్యులైన యువత తమ ప్రతిభతో పలు రంగాల్లో అద్భుతాలను సృష్టిస్తున్నారు. మొన్న, నేడు విజయవంతమైన ఉప గ్రహ ప్రయోగాలు తెలంగాణ ఘనకీర్తిని అంతరిక్షంలోకి మోసుకుపోయాయి.
“స్కైరూట్ ఎరో స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్” అనే అంకుర సంస్థ దేశంలో మొట్టమొదటిసారి రూపొందించి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ ప్రయోగం మొన్ననే విజయవంతమైంది. ఇది తెలంగాణ హార్డ్ వేర్ ఇంకుటేటర్ “టి వర్క్స్” సహకారంతో తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహకంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్ టీహబ్ స్టార్టప్ సంస్థ. మొన్నటి ప్రయోగం విజయవంతం కావడాన్ని దేశమంతా చర్చించుకుంటుండగానే నేడు హైదరాబాద్ కు చెందిన మరో తెలంగాణ స్టార్టప్ కంపెనీ చేత అంతరిక్షంలో మరో అద్భుత ప్రయోగం చోటు చేసుకున్నది. శనివారం శ్రీహరి కోటనుంచి ధ్రువ స్పేస్ సంస్థ పంపిన మరో రెండు శాటిలైట్లు విజయవంతం అయ్యాయి. దాంతో మరోసారి దేశమంతా హర్షాతిరేకాలు మిన్నుముట్టాయి. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో స్టార్టప్ కంపెనీలు సాధించిన ఘనతను ప్రపంచమంతా కొనియాడుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE