వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వైఎస్ షర్మిల పాదయాత్ర సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గంలో కొనసాగుతుండగా, ఈ పాదయాత్ర నేడు (జూన్ 20, సోమవారం) 100వ రోజుకు చేరుకుంది. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా 100 రోజుల్లో వైఎస్ షర్మిల 1320 కిలో మీటర్ల పైగా నడిచారు. 100వ రోజు సందర్భంగా సోమవారం సాయంత్రం 4 గంటలకు కోదాడ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో వైఎస్ షర్మిల పాల్గొననున్నారు.
కాగా వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని వైఎస్ షర్మిల ప్రకటించారు. 99వ రోజు పాదయాత్రలో భాగంగా ఆదివారం నేలకొండపల్లిలో జరిగిన పాలేరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ, పాలేరు నుంచే ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. పాలేరు నుంచి పోటీ చేయాలనీ ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని, అందుకు పాలేరు ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నానని వైఎస్ షర్మిల అన్నారు.
“ఖమ్మం జిల్లా అంటే వైఎస్ఆర్ జిల్లా, ఖమ్మం జిల్లా గడప పాలేరు నియోజకవర్గం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలనే కోరిక ఈనాటిది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచీ ఈ కోరిక వినిపిస్తూనే ఉంది. పాలేరు నుంచి పోటీ చేయాలన్నది ప్రజల కోరిక మాత్రమే కాదు, నా కోరిక కూడా. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీసుకొచ్చే యుద్ధం ఈ పాలేరు నుంచే మొదలు కావాలి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విజయపతాకం ఈ పాలేరులోనే మొట్టమొదట ఎగరాలి. ఈ రోజు నుంచి పాలేరు నియోజకవర్గంలో చరిత్రలో ఎన్నడూ లేని, కనీవినీ మెజారిటీ కోసం మీరు నేను కలిసి పని చేద్దాం” అని పార్టీ కార్యకర్తలతో వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY