మాజీ సీఎం జగన్ ఏకంగా రాజ్యాంగాన్నే ప్రశిస్తున్నారు – మంత్రి నారా లోకేశ్

Minister Nara Lokesh Slams Ex-CM YS Jagan Over Allegations on Mega DSC at Tirupati Public Meeting

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని తిరుపతి వేదికగా ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం’ పేరిట భారీ విజయోత్సవ బహిరంగ సభను నిర్వహించారు.

ఈ వేదికపై రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా చేపట్టిన మెగా డీఎస్సీ (Mega DSC) ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు – మెగా డీఎస్సీపై ఏడవడానికి సిద్ధంగా ఉండండి

వైఎస్సార్సీపీ తన ఐదేళ్ల పాలనలో రాష్ట్ర నిరుద్యోగ యువతను దారుణంగా వంచించిందని, ఒక్కసారి కూడా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేక చేతులెత్తేసిందని మంత్రి ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగుల కలలను నిజం చేస్తూ రికార్డు స్థాయిలో 16,000 కు పైగా ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీని ఎంతో పారదర్శకంగా నిర్వహించి, అర్హులైన అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు కల్పించామని స్పష్టం చేశారు.

రాత్రింబవళ్లు కష్టపడి చదివి, సొంత ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన ఆ 16,000 మంది అభ్యర్థులను, వారి మేధస్సును అవమానించేలా జగన్ ‘డీఎస్సీ స్కామ్’ అంటూ నీచమైన అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిభతో ఉద్యోగాలు పొందిన ఆ ఉపాధ్యాయులందరికీ జగన్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, రాబోయే రోజుల్లో మరో 10,000 ఉద్యోగాలతో నూతన జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయబోతున్నామని, ప్రతిపక్షాలు ఇంకా ఏడవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

న్యాయస్థానాల్లో కేసులు – పరిశ్రమలను అడ్డుకున్న కుట్రలు

కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడాన్ని సహించలేక, మెగా డీఎస్సీని ఎలాగైనా నిలిపివేయాలనే దురుద్దేశంతో వైఎస్సార్సీపీ నాయకులు కోర్టుల్లో ఏకంగా 200 కు పైగా తప్పుడు కేసులు వేసి స్టే తెచ్చేందుకు కుట్రలు పన్నారని లోకేశ్ బహిర్గతం చేశారు. ఆ అడ్డంకులను అన్నింటినీ అధిగమించి తాము నియామకాలు పూర్తి చేశామని గుర్తుచేశారు.

కేవలం రెండేళ్ల వ్యవధిలో ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా రాష్ట్రానికి గూగుల్, టీసీఎస్, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వంటి అంతర్జాతీయ ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ దిగ్గజ సంస్థలను కూడా రాష్ట్రానికి తీసుకొచ్చామని గుర్తుచేసిన లోకేశ్, యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నాలను జగన్ అడ్డుకుంటుంన్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటూ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న జగన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు, నిరుద్యోగులు ఎన్నటికీ క్షమించరని స్పష్టం చేశారు.

రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను ప్రశ్నిస్తున్నారు

కేవలం రాజకీయ ఉనికి కోసమే ప్రతిపక్ష నేత ఇంతటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. డీఎస్సీ ఫలితాలు మరియు ర్యాంకుల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ ఆయన చేస్తున్న ఆరోపణలు కేవలం తమ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు కావని.. అవి ఏకంగా దేశ రాజ్యాంగ స్ఫూర్తిపై జరుగుతున్న దాడులని లోకేశ్ అభివర్ణించారు.

రాజ్యాంగ నిబంధనల ప్రకారం అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు మహిళా అభ్యర్థులకు దక్కిన సామాజిక రిజర్వేషన్ల కోటాను, మెరిట్ అభ్యర్థుల ఎంపిక విధానాన్ని తప్పుబట్టడం అంటే.. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలను, ఆయన రూపొందించిన రిజర్వేషన్ల వ్యవస్థనే ప్రశ్నించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు విజయవంతంగా పూర్తయిందని, సూపర్ సిక్స్ హామీల అమలుతో పాటు సంక్షేమం, పారిశ్రామిక అభివృద్ధి, ఐటీ ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తమ ప్రయాణం మరింత వేగంగా ముందుకు సాగుతుందని మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here