తెలంగాణ రాష్ట్రంలో గల గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో పెండింగ్ విద్యుత్ బిల్లుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జూలై 31, శుక్రవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో మున్సిపాలిటీలు, పంచాయతీ రాజ్, డిస్కం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ, పెండింగ్ విద్యుత్ బిల్లుల అంశంలో ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రతి నెల తప్పనిసరిగా విద్యుత్ బిల్లులను చెల్లించాలని, చెల్లించని పక్షంలో తగు చర్యలు తీసుకోబడుతాయని స్పష్టంచేశారు. పెండింగ్ విద్యుత్ బకాయిలుపై త్వరలోనే నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు నుండి డిస్కం లకు రావాల్సిన బకాయిలపై గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలతో చర్చించి ఒక వారంలోగా సమగ్ర నివేదిక రూపోందించాలని సీఎస్ ఆదేశించారు. త్వరలో స్థానిక సంస్థలలో పేరుక పోయిన పెండింగ్ విద్యుత్ బకాయిలపై సీఎం కేసీఆర్ విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంటారని, కావున సంబంధిత శాఖ అధికారులు పూర్తి వివరాలతో నివేధికను రూపొందించాలని సూచించారు. పనిచేయని బోరుబావులకు సంబంధించిన విద్యుత్ బిల్లులు తదితర అంశాలపై గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటిలు, డిస్కం అధికారులు సంయుక్త బృందాలను తక్షణమే ఏర్పాటు చేసి పెండింగ్ అంశాలపై పరిష్కరించాలని అన్నారు. కరెంట్ మీటర్ రీడింగ్ ప్రాతిపదికనే చార్జీలను వసూలు చేయాలని, నూటికి నూరు శాతం సమగ్ర వివరాలు ఉండాలని ఆదేశించారు. అలాగే ఒక నెల లోపులో అవసరమైన చోట విద్యుత్ మీటర్లను బిగించాలని సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu