ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ(మూడు రాజధానుల బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జూలై 31, శుక్రవారం నాడు ఆమోదం తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఆమోదం కోసం ఈ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ వద్దకు పంపింది. ఈ బిల్లులపై న్యాయ, ఇతర సంబంధిత శాఖల నిపుణులతో సంప్రదింపులు జరిపిన అనంతరం గవర్నర్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది.
ముందుగా జూన్ 16న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం బిల్లులపై శాసన మండలిలో ఎలాంటి చర్చ జరగకుండా నిరవధికంగా ఉభయ సభలు వాయిదా పడ్డాయి. తాజాగా ఈ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడంతో సంబంధిత పక్రియ అంతా పూర్తయినట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా (కార్యనిర్వాహక రాజధాని) విశాఖపట్నం, లెజిస్లేటివ్ క్యాపిటల్(శాసన రాజధాని) గా అమరావతి, జ్యూడిషల్ క్యాపిటల్(న్యాయ రాజధాని) గా కర్నూలు ఏర్పాటు కానున్నాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu