ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష(పాలిసెట్)-2021 ఫలితాలు విడుదల అయ్యాయి. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ ప్రవేశపరీక్ష ఫలితాలను రాష్ట్ర ఐటీ, నైపుణ్యాభివద్ధి శిక్షణశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి బుధవారం నాడు విడుదల చేశారు. సెప్టెంబర్ 1న జరిగిన ఈ పరీక్షకు మొత్తం 68,138 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 91.20 శాతం అనగా 64,187 మంది ఉత్తీర్ణత సాధించారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన కె.రోషన్ లాల్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కామారపు వివేక్ వర్ధన్ మొదటి ర్యాంక్ ను సాధించారు. విద్యార్థులు ర్యాంకు కార్డులను అధికారిక వెబ్ సైట్ లో https://polycetap.nic.in/ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, పాలిసెట్-2021లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. గత ఐదు సంవత్సరాల్లో చూసుకుంటే ఈ ఏడాది ఇంకా ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు. శ్రీకాకుళం అత్యధిక ఉత్తీర్ణత శాతం వచ్చిన జిల్లాగా నిలిచిందని, నెల్లూరు జిల్లాలో అత్యధిక బాలికల ఉత్తీర్ణత శాతం, ప్రకాశం జిల్లాలో అత్యధిక బాలురు ఉత్తీర్ణత శాతం నమోదనన్నారు. ఇక వారం రోజుల్లో పాలిటెక్నిక్ ప్రవేశాల ప్రక్రియ కూడా ప్రారంభం కానుందని తెలిపారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, ఎంప్లాయ్ మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ లావణ్యవేణి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ బంగారు రాజు తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ