ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందిస్తోంది. దీనిలో భాగంగానే ఈరోజు ఆదోనిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులకు రూ.931.02 కోట్ల విలువైన జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న మొత్తం 47,40,421 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి కలుగనుంది. ఆదోని మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు సీఎం విద్యా కానుక కిట్లను అందించారు. అనంతరం మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. విద్యపై పెట్టే వ్యయం విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడి అని పేర్కొన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యను అందించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వరుసగా మూడో విడత విద్యాకానుకను అందిస్తున్నామని, దీనిద్వారా 47 లక్షల మందికి పైగా విద్యార్థులకు రూ.931 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మూడేళ్ళలో నేడు ఇచ్చే విద్యాకానుకతో కలిపి ఇప్పటివరకూ మొత్తంగా రూ.2,368 కోట్లు ఖర్చు చేశామని సీఎం తెలిపారు. పేద పిల్లలకు ఉపయోగపడేలా విద్యాకానుక కిట్లు అందిస్తున్నామని, ఒక్కో కిట్ విలువ రూ. 2 వేలు అని చెప్పారు. భవిష్యత్ అవసరాల కోసం ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని, అందుకే వారికి పాఠాలు సులభంగా అర్ధమయ్యేలా బైజూస్ యాప్ను అందుబాటులోకి తెచ్చామని సీఎం జగన్ వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ