ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, సంపూర్ణ పోషణ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, నాడు-నేడు కార్యక్రమం ఎంత ముఖ్యమో స్కూళ్ల నిర్వహణ కూడా అంతే ముఖ్యమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను వెంటనే భర్తీచేయాలని, దీనివల్ల స్కూళ్లపై పర్యవేక్షణ పెరుగుతుందన్నారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టులను కూడా భర్తీచేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
మధ్యాహ్న భోజనం నాణ్యతపై సమీక్ష సందర్భంగా నాణ్యతా లోపం లేకుండా పిల్లలకు భోజనం అందించడంపై చర్చించారు. అనంతరం అధికారులకు సీఎం కీలక సూచనలు చేశారు. అధికారులు క్రమం తప్పకుండా మధ్యాహ్నం భోజనంపై పర్యవేక్షణ చేయాలని, ఇందుకోసం సరైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలన్నారు. . “స్కూళ్ల నిర్వహణ, మధ్యాహ్న భోజనం పర్యవేక్షణలో హెచ్ఎం, గ్రామ సచివాలయ సిబ్బందిది కీలకపాత్ర. స్కూళ్లకు, అంగన్వాడీలకు బియ్యాన్ని సరఫరాచేసేముందు బియ్యం నాణ్యతను కచ్చితంగా పరిశీలించాలి. సరఫరా చేసే బియ్యం బ్యాగులపై కచ్చితంగా మధ్యాహ్నం భోజనం లేదా ఐసీడీఎస్ బియ్యంగా లేబుల్స్ వేయాలి. కచ్చితంగా ప్రతినెలా ఈ నాణ్యతా పరీక్షలు జరగాలి. ఆహారాన్ని రుచిగా వండడంపై కుక్స్కు తగిన తర్ఫీదు ఇవ్వాలి. క్రమం తప్పకుండా శిక్షణ కార్యక్రమాలు జరగాలి. చిక్కీల నాణ్యతపై కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. తయారీ దారుల వద్దా, సరఫరా సమయంలోనూ, పిల్లలకు పంపిణీ చేసేటప్పుడు, ఈ మూడు దశల్లోనూ నాణ్యతపై ర్యాండమ్ పరీక్షలు చేయాలి” అని సీఎం ఆదేశాలు ఇచ్చారు. అలాగే గుడ్లు పంపిణీలో సమయంలో వాటికి తప్పనిసరిగా స్టాంపింగ్ చేస్తున్నామన్న అధికారులు తెలుపగా, స్టాంపింగ్ లేకుండా పంపిణీచేస్తే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఇక వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, సంపూర్ణపోషణ ప్లస్ కార్యక్రమంపైనా కూడా గట్టిగా పర్యవేక్షణ ఉండాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు.
ఈ సమీక్షా కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి కేవి ఉషా శ్రీచరణ్, సీఎస్ సమీర్ శర్మ, విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ఏ.సిరి, సెర్ఫ్ సీఈఓ ఏ.ఎండి ఇంతియాజ్, మెప్మా ఎండీ వి.విజయలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY