భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య స్వదేశంలో మూడు వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ధర్మశాల వేదికగా మార్చి 12న తొలి వన్డే, లక్నో వేదికగా మార్చి 15న రెండో వన్డే, కోల్కతాలోని ఈడెన్గార్డెన్స్లో మార్చి 18న మూడో వన్డేలో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వన్డే సిరీస్కు బీసీసీఐ భారత్ జట్టును ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ సునీల్ జోషి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మార్చ్ 8, ఆదివారం నాడు దక్షిణాఫ్రికాతో సిరీస్ కు భారత్ జట్టును ఎంపిక చేసింది.
దాదాపు ఆరు నెలల పాటు క్రికెట్ కు దూరమైన భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. అలాగే గాయపడి కొన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉంటున్న ఓపెనర్ శిఖర్ ధావన్, పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తిరిగి జట్టుకు ఎంపికయ్యారు. మరోవైపు గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని నేపథ్యంలో రోహిత్శర్మకు విశ్రాంతిని కొనసాగించారు. గత న్యూజిలాండ్ పర్యటనలో దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయిన శార్దూల్ ఠాకూర్, ఆల్రౌండర్ శివమ్ దూబే, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ లను ఈ సిరీస్ కు ఎంపిక చేయలేదు. అయితే పృథ్వీ షా, శుభ్మన్ గిల్ జట్టులో వారి స్థానాలను నిలుపుకున్నారు.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు ఎంపికైన భారత్ జట్టు:
శిఖర్ ధావన్, పృథ్వీ షా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), కెఎల్ రాహుల్, మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైని, కుల్దీప్ యాదవ్, శుభ్మన్ గిల్.