ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు చైనా, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువుగా ఉంది. అయితే తాజా లెక్కల మేరకు కరోనా బాధితుల సంఖ్యలో అమెరికా మొదటిస్థానంలో నిలిచింది. మార్చ్ 26, గురువారం నాటికి 83,545 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో చైనా, ఇటలీని దాటుకొని ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన దేశంగా అమెరికా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో ఇది 14.9 శాతం కాగా, ఇప్పటివరకు ఈ వ్యాధి వలన అమెరికాలో 1,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
మిగతా దేశాలతో పోలిస్తే అమెరికాలో కరోనా నిర్ధారణ పరీక్షల్ని భారీ స్థాయిలో నిర్వహించడంతోనే సంఖ్య పెరిగినట్టుగా వెల్లడిస్తున్నారు. ఒక్క న్యూయార్క్లోనే 38వేల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే వేరే దేశాల్లో కంటే మృతుల సంఖ్య అమెరికాలో తక్కువగా ఉండడం ఊరట కలిగించే విషయం. మరోవైపు ఇప్పటి వరకు చైనాలో 81,285 మందికి, ఇటలీలో 80,589 మందికి వైరస్ సోకినట్లుగా నిర్ధారించారు.