విడతలవారీగా వారాహి యాత్ర చేపడుతూ హోరెత్తిస్తున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. వైసీపీ ప్రభుత్వమే లక్ష్యంగా విమర్శల బాణాలు వదులుతున్నారు. జగన్ సర్కార్ తప్పులను ఎండగడుతున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ రాజకీయాలు గరంగరంగా ఉన్న సమయంలో టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చి ఒక్కసారిగా రాజకీయాలను మరింత హీటెక్కించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఈ పొత్తు అంశమే ఇప్పుడు జనసేనలో ఇంటర్నల్ ఇష్యూస్ను తీసుకొచ్చింది. జనసైనికుల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసింది. ఫలితంగా ఓ సీనియర్ నేత సహా 100 మంది జనసైనికులు పార్టీకి గుడ్ బై చెప్పేశారు.
చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో పరామర్శించేందుకు వెళ్లిన పవన్ కల్యాణ్.. జైలు ఎదుటే పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీతో కలిసి వెళ్తామని జనసేనాని చెప్పుకొచ్చారు. అయితే టీడీపీతో పొత్తు విషయంపై పవన్ కల్యాణ్ కేవలం నాదెండ్ల మనోహర్తో మాత్రమే చర్చించి నిర్ణయం తీసుకున్నారట. వారిద్దరు ఏకాభిప్రాయంగా టీడీపీతో పొత్తును ప్రకటించారట. కానీ పార్టీలో సీనియర్ నేతలు, కార్యకర్తలతో ఈ విషయం గురించి చర్చించలేదట. దీంతో పార్టీలో సీనియర్ నేతలు, కార్యకర్తల మనోభావాలు దెబ్బ తిన్నాయి. చాలా మంది పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై పవన్ కల్యాణ్ కోటి ఆశలు పెట్టుకున్నారు. తన బలం, బలంగా అంతా ఇక్కడే ఉన్నారని పలుమార్లు జనసేనాని చెప్పుకొచ్చారు. ఏకంగా వారాహి యాత్రను కూడా తన సొంత జిల్లా పశ్చిమ గోదావరిని కాదని.. తూర్పు గోదావరి నుంచి ప్రారంభించారు. అంతలా ఆశలు పెట్టుకున్న పవన్కు తూర్పుగోదావరి జిల్లాలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఓ సీనియర్ నేత సహా 100 మంది కార్యకర్తలు ఒకేసారి జనసేన పార్టీకి గుడ్ బై చెప్పేశారు. రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేడా గురుదత్త సహా 100 మంది పార్టీకీ రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ ఒంటెద్దు పోకడ పోతున్నారని గురుదత్త సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడిందని వ్యాఖ్యానించారు. పార్టీలో అవమానాలు ఎక్కువైపోయాయని.. అధిష్టానం అపాయింట్మెంట్ కోసం మూడు నెలలుగా చేస్తున్నా దొరకడం లేదని అన్నారు. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం గురించి పవన్ పదే పదే చెప్తారన్న గురుదత్త.. తన పార్టీలో ఉన్న వారికి కూడా అవి ఉంటాయన్న విషయం మర్చిపోయారని వ్యాఖ్యానించారు.
ఇకపోతే జనసేనాని ఒంటెద్దు పోకడల వల్ల పార్టీలో చాలా మంది నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం సీనియర్ నేతలతో కూడా చర్చించకుండా.. నిర్ణయాలు తీసుకుంటుండడంతో చాలా మంది అసంతృప్తిగా ఉన్నారట. త్వరలో మరికొందరు సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేసేందుకు రెడీ అయిపోతున్నారట. మరి ఈ సమయంలో జనసేనాని ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE