పొత్తులు.. ఎత్తులు.. అరెస్ట్లు.. ఆందోళనలతో ఏపీ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్తో ఒక్కసారిగా రాజకీయాలు భగ్గుమన్నాయి. అదే సమయంలో పొత్తులపై క్లారిటీ ఇచ్చి జనసేనాని పవన్ కల్యాణ్ పొలిటికల్ హీట్ మరింత పెంచారు. జైలులో ఉన్న చంద్రబాబు నాయుడును పరామర్శించేందుకు వెళ్లిన పవన్.. జైలు ముందే పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓట్లను ఎట్టి పరిస్థితిలోనూ చీలిపోనివ్వమని చెప్పుకొచ్చారు. హస్తినాకు వెళ్లి బీజేపీ అధిష్టానంతో కూడా పొత్తులపై చర్చిస్తామని పవన్ చెప్పారు.
అయితే ముందు నుంచి సీఎం జగన్ బీజేపీ అధిష్టానానికి దగ్గరగా ఉంటున్నారు. నెలలో కనీసం నాలుగైదు సార్లు అయినా ఢిల్లీ టూర్కు వెళ్లి పెద్దలను కలుస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత కూడా జగన్ ఢిల్లీకి వెళ్లి.. పెద్దలతో భేటీ అయ్యారు. దీంతో చంద్రబాబు అరెస్ట్ వెనుక ఢిల్లీ పెద్దల హస్తం ఉందన్న టాక్ వినిపించింది. ఈక్రమంలో బీజేపీ.. టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందా అనే అంశం ఇంట్రెస్టింగ్గా మారింది. దీనిపై బీజేపీ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ పొత్తుపై బీజేపీ అధిష్టానం ఆలోచన ఏమిటన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. సరిగ్గా ఇదే సమయంలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరికి ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు రావడం.. వెంటనే ఆమె హస్తినాకు పయనమవడం ఆసక్తికరంగా మారింది.
బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో పురంధేశ్వరి హుటాహుటిన ఢిల్లీకి పయనమై వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో పురంధేశ్వరి చర్చలు జరపనున్నారు. అయితే పురంధేశ్వరి ఢిల్లీకి వెళ్లిందే పొత్తులపై తేల్చుకునేందుకు అని వాదన వినిపిస్తోంది. పొత్తులపై లెక్కలు తేల్చుకున్నాకే పురంధేశ్వరి తిరిగి రాష్ట్రంలో అడుగుపెడుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పురంధేశ్వరి తిరిగొచ్చే సరికి.. పొత్తులపై ఒక క్లారిటీ వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక ఇదే సమయంలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. పురంధేశ్వరి తిరిగొచ్చే సమయానికి పవన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. పవన్ కూడా ఢిల్లీ పెద్దలతో సమావేశం కానున్నారు. ఈక్రమంలో పురంధేశ్వరి పర్యటన తర్వాత పొత్తులపై క్లారిటీ రాకపోయినప్పటికీ.. జగన్ టూర్ తర్వాత మాత్రం కచ్చితంగా పొత్తులపై క్లారిటీ వస్తుందనే వాదన వినిపిస్తోంది. ఈ పరిణామాల మధ్య బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతోంది?.. టీడీపీ, జనసేనలతో పొత్తు పెట్టుకుంటుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE