ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఇప్పటికి కేవలం తాడిపత్రి, మైదుకూరు మున్సిపాలిటీల్లోనే అత్యధిక వార్డులు గెలుచుకోగలిగింది. తాడిపత్రిలో మొత్తం 36 వార్డుల్లో టీడీపీ 18, వైఎస్సార్సీపీ 16, సీపీఐ 1, ఇతరులు 1 గెలుచుకున్నారు. అలాగే మైదుకూరులో టీడీపీ 12, వైఎస్సార్సీపీ 11, జనసేన ఒక వార్డు గెలుచుకున్నాయి. ఇక టీడీపీకి కంచుకోటగా ఉండే హిందూపురంలో కూడా వైఎస్సార్సీపీ హవానే నడిచింది. హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డుల్లో 29 వార్డులను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీకి 6, బీజేపీ 1, ఎంఐఎం 1, ఇతరులు 1 వార్డు దక్కించుకున్నారు.
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సంచలన ఫలితాలతో చరిత్ర సృష్టిస్తుంది. చిత్తూరు, తిరుపతి, కడప, ఒంగోలు, కర్నూలు, గుంటూరు కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించగా, విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో 55 డివిజన్లలో ఆధిక్యంలో నిలిచింది. అలాగే 75 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో ఇప్పటికే 55 చోట్ల విజయాలను నమోదు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో “ఫ్యాన్” హవానే కొనసాగింది.
ఈ ఎన్నికల్లో పట్టణాలు, నగరాల్లోని ప్రజలు అధికార వైఎస్సార్సీపీకి జైకొట్టడంతో క్లీన్స్వీప్ దిశగా దూసుకుపోతోంది. ఏపీ మున్సిపల్ ఎన్నికల చరిత్రలో ఇంతవరకు ఒకే పార్టీకి పట్టం ఇదే తొలిసారి. దీంతో వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించిన పరిపాలనతో ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని అన్నారు. త్వరలో జరిగే ఎంపీటీసీ, జెట్పీటీసీ ఎన్నికలలో ఇటువంటి ఫలితాలే వస్తాయని అన్నారు.
- కనిగిరి, గిద్దలూరు, బద్వేల్, రాయదుర్గం, ఆళ్లగడ్డ, పుట్టపర్తి, నెల్లిమర్ల, పుత్తూరు, నగరి, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి, బొబ్బిలి, జంగారెడ్డిగూడెం, వెంకటగిరి, గొల్లప్రోలు, పాలకొండ, సూళ్లూరుపేట, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, నరసాపురం వంటి మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో వైఎస్సార్సీపీ సంచలన ఫలితాలతో విజయం సాధించింది.
- రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి ఫలితాలు సాయంత్రం 6 గంటలకు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ డివిజన్లు ఉండడంతో విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఫలితాలు మాత్రం కొద్దిగా ఆలస్యం కానున్నట్టు తెలుస్తుంది.
- మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 12 కార్పొరేషన్లకు మరియు 71 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు మార్చి 10 పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. నేడు జరిగే ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేసింది. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్ అనుమతించడం లేదని, అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత నిమిత్తం మొత్తం 20,419 పోలీసు సిబ్బందిని నియమించారు. ఓట్ల లెక్కింపులో భాగంగా కార్పొరేషన్లలో 2,204 టేబుళ్లు, మున్సిపాలిటీలు/నగర పంచాయతీలో 1,822 టేబుళ్లు కలిపి మొత్తం 4,026 టేబుళ్లను ఏర్పాటు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ