ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉంది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడైనా ముందస్తుకు వెళ్లొచ్చన్న ఊహాగానాలు అడపదడపా వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల మధ్య అప్పుడే పొత్తులు పొడుస్తున్నాయి. ఈ క్రమంలో మరోసారి పార్టీల మధ్య పొత్తుకు తేరా తీశారు బీజేపీ ఎంపీ జీవీఎల్. గురువారం విశాఖపట్నంలో విలేఖరుల సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఏపీకి సంబంధించిన పలు విషయాలపై మాట్లాడుతూ.. ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు కూటమి కడతాయని, కలిసే పోటీ చేస్తాయని ఆయన ప్రకటించారు. బీజేపీతో కలిసి ముందుకు సాగుతామని చాలాసార్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించారని జీవీఎల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అలాగే ఆత్మకూరు ఉపఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని, త్వరలోనే అభ్యర్థిని నిలబెడతామని జీవీఎల్ పేర్కొన్నారు. దీనిపై జనసేన పార్టీతో సంప్రదించాకే నిర్ణయాన్ని ప్రకటించామని తెలిపారు. సీఎం జగన్ అవినీతిని అరికట్టడానికి ఇచ్చిన ప్రకటన బావుందని, అయితే ఇందులో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులను కూడా చేర్చి ఉంటే ఇంకా బావుండేదని వ్యాఖ్యానించారు. త్వరలోనే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రకటన రానుందని జీవీఎల్ స్పష్టం చేశారు. ఇక ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రుషికొండలో నిబంధనలు తుంగలో తొక్కి సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణం చేస్తోందని, దీనికోసం కొన్ని వందల చెట్లను కూల్చివేశారని విమర్శించారు. ఏపీలో త్వరలో కేంద్రస్థాయి పార్టీ ప్రముఖులు రానున్నట్లు తెలిపారు. జూన్ 6, 7 తేదీలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జూన్ 12, 13 తేదీలలో కేంద్ర మంత్రి జయశంకర్.. ఇంకా జులై 4న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాన్ని సందర్శించనున్నట్లు ఎంపీ జీవీఎల్ ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF