త్వరలో జరగబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు కదులుతున్నారు. పెద్ద ఎత్తున సిట్టింగ్లకు ఝలక్ ఇచ్చి.. కొత్త వారిని తెరపైకి తీసుకొస్తున్నారు. అయితే ఈ సిట్టింగ్ల మార్పు అంశం వైసీపీకి తలనొప్పిగా మారింది. టికెట్ దక్కకపోవడంతో పెద్ద ఎత్తున అసంతృప్తులు పార్టీకి గుడ్ బై చెప్పి.. ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. అంతేకాకుండా ఇంఛార్జ్ల మార్పుతో కొన్ని ప్రాంతాల్లో పార్టీ రెండుగా చీలిపోయే పరిస్థితి నెలకొంది. గాజువాకలో ఇప్పటికే వైసీపీ రెండుగా చీలిపోయింది.
ఇటీవల గాజువాక వైసీపీ ఇంఛార్జ్గా కార్పోరేటర్ ఉరుకూటి రామచంద్రరావును జగన్ నియమించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే గాజువాక టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గాజువాక టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి.. తన కుమారుడు దేవాన్ రెడ్డి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో గాజువాక ఇంఛార్జ్గా రామచంద్రరావును నియమించడంతో.. తిప్పల వర్గం అసంతృప్తితో రగిలిపోతోంది. ఈక్రమంలో తిప్పల వర్గం.. ఊరుకూటి వర్గంగా గాజువాకలో వైసీపీ రెండుగా చీలిపోయింది.
గాజువాకలో తిప్పల, ఊరుకూటి రెండు వర్గాలు బలంగానే ఉన్నాయి. కానీ తిప్పల వర్గంపై నెగిటివిటీ ఎక్కువగా ఉందట. జనాదరణ కూడా ఆ వర్గానికి తగ్గిపోయిందని సర్వేల్లో తేలిందట. నాగిరెడ్డి కుమారుడికి టికెట్ ఇచ్చినా.. గెలిచే అవకాశాలు లేవని తేలిపోయిందట. అట రామచంద్రారెడ్డికి అనుకూలంగా సర్వేలు వచ్చాయట. అలాగే ఊరుకూటికి మంత్రి గుడివాడ అమర్నాథ్ మద్ధతు కూడా ఉందట. అందుకే జగన్ తిప్పలను పక్కకు పెట్టి ఊరుకూటి రామచంద్రారెడ్డిని గాజువాక ఇంచార్జ్గా నియమించారట. ఈక్రమంలో గాజువాక వైసీపీలో చిచ్చురాజుకుంది.
ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టేందుకు వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నించినప్పటికీ ఆయన వల్ల కాలేదట. ఈ వర్గ పోరు ఇలానే కొనసాగితే గాజువాకతో పాటు.. విశాఖ ఎంపీ స్థానాన్ని కూడా దక్కించుకోవడం కష్టమేనని వైసీపీ హైకమాండ్ భావిస్తోందట. అందుకే ఆ పోరుకు ఎలాగైనా పులిస్టాప్ పెట్టేలా చర్యలు తీసుకుంటుందట. మరి చూడాలి ముందు ముందు గాజువాకలో ఏం జరుగుతుందో.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY