ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే మంగళవారం నాడు సభలో ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలపై చర్చించాల్సిందిగా స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు జై అమరావతి నినాదాలుతో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్న సమయంలోనే రైతు భరోసా కేంద్రాలపై రాష్ట్ర మంత్రులు ప్రసంగాలను కొనసాగించారు. అనంతరం టీడీపీ సభ్యుల తీరుపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని చెప్పారు. 10మంది టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి తమ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తూ వీధి రౌడీల్లా వ్యవరిస్తున్నారని అన్నారు. అలాగే ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను మార్షల్స్ సాయంతో బయటకు పంపించమని స్పీకర్ను కోరారు.
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, టీడీపీ సభ్యుల తీరుతో సభలో ఇతరసభ్యుల యొక్క హక్కులు హరించుకుపోతున్నాయని, ఇకపై ఇలాంటి పరిస్థితి కొనసాగితే ఎలాంటి చర్యలకైనా సిద్ధమని హెచ్చరించారు. ఇది సభ అనుకుంటున్నారా? మీ ఇల్లు అనుకుంటున్నారా అంటూ టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులను వారి స్థానాల్లో కూర్చోబెట్టాలని మార్షల్స్ ను స్పీకర్ ఆదేశించారు. ఈ క్రమంలో మార్షల్స్, టీడీపీ సభ్యులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. అసెంబ్లీలోకి మార్షల్స్ రావడం పట్ల టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వ తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తునట్టు ప్రకటించి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు.
[subscribe]