ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఏపీ పోలీసులపై మండిపడ్డారు. బుధవారం అమలాపురం పర్యటనకు వెళ్తున్న సమయంలో ఆయనను తూర్పు గోదావరి జిల్లా జొన్నాడ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వీర్రాజు కారుని ముందుకు కదలనీయకుండా పోలీసులు మరో వాహనాన్ని అడ్డుపెట్టారు. అమలాపురం పర్యటనకు అనుమతి లేదని, జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉందని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ తో మాట్లాడి తన పర్యటనకు అనుమతి ఇప్పించాలని కోరగా, రావులపాలెం వరకు మాత్రం అనుమతినిచ్చారు. దీనిపై ఆయన ఏపీ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం సోము వీర్రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల అమలాపురంలో జరిగిన అల్లర్లలో బాధ్యులను చేస్తూ కొంతమందిపై కేసులు నమోదు చేశారని, ఈ నేపథ్యంలో తాను బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్నానని, ఇందులో ఆక్షేపించటానికేం ఉందని మండిపడ్డారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు మీకు ఎవరిచ్చారని, ఎస్పీ స్థాయి అధికారికి వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఈ ఆంక్షలెందుకని పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుందో ప్రభుత్వ నిఘా వర్గాలకు కూడా తెలియని స్థితిలో రాష్ట్ర పాలన ఉందని, అడుగడుగునా ఆంక్షలతో పోలీసు భద్రత మధ్య రాష్ట్రాన్ని ఎంతకాలం పాలిస్తారని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF