మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసుకి సంబంధించిన విచారణ శనివారం హైదరాబాద్ సీబీఐ కోర్టులో ప్రారంభమైంది. ఈ క్రమంలో కేసులోని ప్రధాన, అనుబంధ ఛార్జిషీట్లను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం కేసుకు ఎస్సీ/01/2023 నంబర్ను కేటాయించింది. ఇక కేసు విచారణ సందర్భంగా ప్రధాన అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులకు సమన్లు జారీ చేసింది. వారు ఫిబ్రవరి 10న కోర్టు ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సీబీఐ కోర్టు సమన్లు అందుకున్నవారిలో సునీల్, దస్తగిరి, ఉమాశంకర్, ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా.. మరోవైపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు విచారణ నిమిత్తం హైదరాబాద్లోని సీబీఐ అధికారుల ఎదుట హాజరవుతున్నారు.
కాగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను ఆంధ్రప్రదేశ్లోని కడప కోర్టు నుండి హైదరాబాద్లోని ప్రత్యేక సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేష్లతో కూడిన ధర్మాసనం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే నేడు ఈ కేసు విచారణను సీబీఐ కోర్టు ప్రారంభించింది. ఇక మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మార్చి 15, 2019 న ఆంధ్రప్రదేశ్లోని కడపలోని తన నివాసంలో దారుణంగా హత్య చేయబడ్డారు. ఎన్నికల సమయం కావడంతో ఇది రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE