విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్రప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ బీజేపీ నాయకులు సోమవారం నాడు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటికరణ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, వారి మనోభావాలను పరిరక్షించాల్సిన అవసరముందని తెలియజేశామని సోము వీర్రాజు తెలిపారు.
ఉక్కు కర్మాగారం పరిరక్షణకు ఉన్న ప్రత్యామ్నాయ అంశాలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకెళ్లామని, ఉక్కు కర్మాగారం ఉద్యోగుల శ్రేయస్సును పరిరక్షించాలని మంత్రిని కోరడం జరిగిందని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో సోము వీర్రాజుతో పాటుగా ఏపీ పార్టీ ఇంఛార్జ్ సునీల్ థియోధర్, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ