ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 26, బుధవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలను చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇదే నెలలో 12వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలకంగా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చాక 15 రోజుల్లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసేలా చట్టంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. అలాగే ఎన్నికల్లో డబ్బు, మద్యంతో అక్రమాలకు పాల్పడితే అనర్హత వేటుతో పాటుగా గరిష్టంగా మూడేళ్ళ వరకు జైలు శిక్ష విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ అంశాలపై రాష్ట్రప్రభుత్వం ఇటీవలే ఆర్డినెన్సు కూడా తీసుకొచ్చింది.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే బడ్జెట్ సమావేశాలు నిర్వహిద్దామని గత కేబినెట్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మంత్రులకు సూచించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్, రిజర్వేషన్ల వివరాలు హైకోర్టు తీర్పుతో ముడిపడి ఉండడంతో ఫిబ్రవరి 26న జరిగే సమావేశంలో ఈ అంశంపై మరోసారి చర్చించనున్నట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వ అవినీతి వ్యవహారాలపై సిట్ ఏర్పాటు, ఈఎస్ఐ కుంభకోణం నివేదికపై కూడా ఈసమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
[subscribe]