అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు భారతదేశ పర్యటనకు వస్తున్నారు. ఫిబ్రవరి 24,25 తేదీల్లో రెండు రోజులపాటు డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటిస్తారు. ముందుగా వైట్ హౌస్ నుంచి తన సతీమణి మెలానియాతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో భారత్ కు బయల్దేరారు. ఈ రోజు (ఫిబ్రవరి 24, సోమవారం) ఉదయం 11.40 గంటలకు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో గల సర్దార్ వల్లభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్రంప్ చేరుకోనున్నారు. మొత్తం 12 మంది కూడిన అధికారిక బృందంతో ట్రంప్ భారత పర్యటనకు వస్తున్నారు.
భారత్ పర్యటనకు వచ్చే ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ తన స్నేహితుడని, భారత ప్రజలను కలుసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని తెలిపారు. అలాగే ప్రధాని మోదీ ట్విట్టర్లో స్పందిస్తూ, “భారతదేశం మీ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మీ పర్యటన ఇరు దేశాల మధ్య మైత్రిని మరింత బలోపేతం చేస్తుంది. అహ్మదాబాద్లో మిమ్మల్ని కలుసుకుంటానని” పేర్కొన్నారు. మరోవైపు ట్రంప్ పర్యటన పూర్తి వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ ఆదివారం నాడు వెల్లడించింది.
భారత్లో డోనాల్డ్ ట్రంప్ అధికారిక షెడ్యూల్:
ఫిబ్రవరి 24, సోమవారం:
- ఉదయం 11.40 గంటలు: అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్రంప్ చేరుకుంటారు.
- మధ్యాహ్నం 12.15 గంటలు: అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు.
- మధ్యాహ్నం 1.05 గంటలు: మొతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొంటారు.
- సాయంత్రం 3.30 గంటలు: ఆగ్రాకు బయల్దేరతారు.
- సాయంత్రం 4.45 గంటలు: ఆగ్రాకు చేరుకుంటారు.
- సాయంత్రం 5.15 గంటలు: తాజ్మహల్ను సందర్శిస్తారు.
- సాయంత్రం 6.45 గంటలు: ఢిల్లీకి బయల్దేరతారు.
- సాయంత్రం 7.30 గంటలు: ఢిల్లీకి చేరుకుంటారు.
ఫిబ్రవరి 25, మంగళవారం:
- ఉదయం 10 గంటలు: రాష్ట్రపతి భవన్లో స్వాగత కార్యక్రమానికి ట్రంప్ హాజరవుతారు.
- ఉదయం 10.30 గంటలు: రాజ్ఘాట్లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు.
- ఉదయం 11 గంటలు: హైదరాబాద్ హౌస్లో ట్రంప్, మోదీ మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది.
- మధ్యాహ్నం 12.40 గంటలు: కీలక ఒప్పందాలపై సంతకాలు/ ఇరుదేశాల నేతల మీడియా సమావేశం.
- సాయంత్రం 7.30 గంటలు: రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీ
- రాత్రి 10 గంటలు: డోనాల్డ్ ట్రంప్ అమెరికాకు తిరుగు పయనం.
[subscribe]