తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చ్ 4 వరకు 10 రోజుల పాటుగా రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఫిబ్రవరి 24న ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్నగర్కు రానున్నట్టు టూరిజం, క్రీడా, ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించిన శ్రీనివాస్గౌడ్ అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలను, నగరాలను మరింత గొప్పగా అభివృద్ధి చేసేందుకు 70 కొత్త మున్సిపాలిటీలు, 12 కార్పోరేషన్లను సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతుందని చెప్పారు. జిల్లాలో కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని టిఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.