ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఉగాది పండగ నాటికి ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆదేశించారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్లో సంబంధిత అధికారులతో జిల్లాల పునర్విభజనపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల మ్యాపులు, జిల్లా కేంద్రాల నిర్ణయం తీసుకోవడానికి కారణాలను అధికారులు సీఎం జగన్కు వివరించారు. అదేవిధంగా ప్రజలు, ప్రతిపక్ష పార్టీలనుంచి అందుతున్న అభ్యంతరాలు, సలహాలు, సూచనలను పరిశీలిస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, హోం మంత్రి సుచరిత, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ మేరకు, ఆయా కొత్త జిల్లాల్లో పరిపాలనకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల్లో పరిపాలనను రానున్న ఉగాది పండగ నుంచే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ చెప్పారు. ఉగాది పండగ రోజు నుంచి అన్ని కొత్త జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కార్యకలాపాలు మొదలుపెట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పరిపాలన కొరకు కొత్త భవనాలు అందుబాటులోకి వచ్చేంత వరకు తాత్కాలిక భవనాలను గుర్తించి మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం జగన్ సూచించారు. ఈ క్రమంలో, స్థానిక సంస్థల విభజన విషయంలో కూడా అనుసరించాల్సిన విధానాన్ని పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ