శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నటుడు కమల్హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు-2 సినిమా సెట్స్లో ఫిబ్రవరి 19, బుధవారం నాడు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. చిత్రీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ క్రేన్ కుప్పకూలి, 150 అడుగుల ఎత్తు నుంచి టెంట్పై పడడంతో చిత్ర యూనిట్ కి సంబంధించిన ముగ్గురు అక్కడిక్కడే చనిపోగా, మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కృష్ణ (అసిస్టెంట్ డైరెక్టర్), చంద్రన్ (ఆర్ట్ అసిస్టెంట్), మధు (ప్రొడక్షన్ అసిస్టెంట్) చనిపోయినట్టుగా చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వెల్లడిందించింది. గాయపడిన వారిని చెన్నైలోని సవిత ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దర్శకుడు శంకర్కు కూడా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. అయితే ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.
ప్రమాదం జరిగిన సమయంలో హీరో కమల్ హాసన్ పాటు హీరోయిన్ కాజల్ కూడా సెట్లోనే ఉన్నారు. ప్రమాదంపై హీరో కమల్ హాసన్ ట్విట్టర్లో స్పందిస్తూ, ఇంతకుముందు ఎన్నో ప్రమాదాలు దాటి వచ్చానని, అయితే ఈ ప్రమాదం చాలా క్రూరమైనదని అన్నారు. చనిపోయిన యూనిట్ సభ్యులకు సంతాపం తెలుపుతూ, వారి కుటుంబ సభ్యుల బాధను, దుఃఖాన్ని పంచుకుంటున్నాను అని పేర్కొన్నారు. అనంతరం ఆసుపత్రికి చేరుకుని గాయపడిన వారిని కమల్ హాసన్ పరామర్శించారు. గాయపడిన వారు చికిత్స పొందుతున్నారని, త్వరగా కోలుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.